నేలచూపులతో- మెటల్‌, రియల్టీ ప్లస్‌

2 Dec, 2020 09:48 IST|Sakshi

సెన్సెక్స్‌ 35 పాయింట్లు మైనస్‌‌- 44,621కు

6 పాయింట్లు నీరసించి 13,103 వద్ద కదులుతున్న నిఫ్టీ

మెటల్‌, రియల్టీ, ఆటో, ఫార్మా అప్‌- ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం అప్‌

ముంబై, సాక్షి: జీడీపీ జోష్‌తో ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621కు చేరింది. నిఫ్టీ నామమాత్రంగా 6 పాయింట్లు బలహీనపడి 13,103 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,561 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,128-13,088 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

మీడియా లాభాల్లో
ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా రంగాలు 1.7-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐవోసీ, టాటా మోటార్స్‌, హిందాల్కో, యూపీఎల్‌, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా 3.2-1.1 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్‌ మహీంద్రా, కొటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌, శ్రీ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే 1.6-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

నాల్కో అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో నాల్కో, హెచ్‌పీసీఎల్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, ఎన్‌ఎండీసీ, వేదాంతా, టాటా కెమ్‌, ఎక్సైడ్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క నౌకరీ, మదర్‌సన్‌, ఐజీఎల్‌, ముత్తూట్‌, బాలకృష్ణ, సన్‌ టీవీ, సీమెన్స్‌, అరబిందో, మెక్‌డోవెల్‌ 1.5-0.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,340 లాభపడగా.. 646 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు