తొలుత లాభాల సెంచరీ- ప్రస్తుతం 63 పాయింట్లు డౌన్
37,737 వద్ద కదులుతున్న సెన్సెక్స్- తొలుత 38,004కు
15 పాయింట్లు క్షీణించి 11,163 వద్ద ట్రేడవుతున్న నిఫ్టీ
మీడియా, మెటల్, ఐటీ జోరు- ఫార్మా, బ్యాంకింగ్ డీలా
ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 63 పాయింట్లు నీరసించి 37,737 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 15 పాయింట్లు క్షీణించి 11,163 వద్ద కదులుతోంది. అయితే తొలుత సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించి 38,000 పాయింట్ల మార్క్ ఎగువకు చేరింది. ఇక నిఫ్టీ తొలుత 50 పాయింట్లు బలపడింది.
లాభాల్లో
ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, మెటల్, ఐటీ, రియల్టీ రంగాలు 2-0.7 శాతం మధ్య ఎగశాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా 0.8 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్టీపీసీ, జీ, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హిందాల్కో, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఐవోసీ, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్, విప్రో 2.5-1 శాతం మధ్య వృద్ధి చూపాయి. అయితే బీపీసీఎల్, ఆర్ఐఎల్, ఎయిర్టెల్, యాక్సిస్, టాటా మోటార్స్, ఎస్బీఐ, గ్రాసిమ్, ఇన్ఫ్రాటెల్ 2-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి.
సన్ టీవీ జోరు
డెరివేటివ్ కౌంటర్లలో సన్ టీవీ 9 శాతం దూసుకెళ్లగా.. గ్లెన్మార్క్, వోల్టాస్, మైండ్ట్రీ, అదానీ ఎంటర్, ఎన్ఎండీసీ, నిట్టెక్, జిందాల్ స్టీల్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 2.6-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోవైపు బెర్జర్ పెయింట్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్, కమిన్స్, లుపిన్, ఇండిగో, ఎంజీఎల్, అరబిందో, గోద్రెజ్ సీపీ, ఎంఆర్ఎఫ్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్స్ 0.1 శాతం డీలాపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1129 లాభపడగా.. 811 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.