Maruti Mid-SUV: మారుతీ సుజుకీ మిడ్‌-ఎస్‌యూవీ 

8 Sep, 2022 12:21 IST|Sakshi

ఈ నెలాఖరులోగా ఆవిష్కరణ

న్యూఢిల్లీ: దేశంలో కంపెనీ మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎస్‌యూవీ) విభాగాన్ని కీలకంగా పరిగణిస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్యాసింజర్‌ వెహికిల్స్‌ రంగంలో ప్రస్తుతం సంస్థ వాటా 45 శాతంగా ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది మారుతీ సుజుకీ లక్ష్యం. ‘ఎస్‌యూవీయేతర విభాగంలో కంపెనీ వాటా 65 శాతం పైచిలుకు. ఎస్‌యూవీల్లో అంత పెద్దగా లేదు.

దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఇది. ఇందులో మారుతీ సుజుకీ తప్పనిసరిగా సుస్థిర స్థానం సంపాదించాలి. ప్రారంభ స్థాయి ఎస్‌యూవీల విపణి వార్షిక పరిమాణం 6.6 లక్షల యూనిట్లు. ఇందులో సంస్థకు 20 శాతం వాటా ఉంది. 5.5 లక్షల యూనిట్ల వార్షిక పరిమాణం ఉన్న మధ్యస్థాయి ఎస్‌యూవీ విభాగంలో కంపెనీకి ఒక్క మోడల్‌ కూడా లేదు. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ ఆవిష్కరించనున్నాం. 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఎస్‌యూవీలపైనా దృష్టిసారిస్తాం’ అని మారుతీ సుజుకీ సీనియర్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

మరిన్ని వార్తలు