మారుతీ ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి

16 Apr, 2022 00:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మల్టీ పర్పస్‌ వెహికల్‌ ఎర్టిగా కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.8.35–12.79 లక్షల మధ్య ఉంది. మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్‌ విధానంలోనూ కారును సొంతం చేసుకోవచ్చు. చందా నెలకు పెట్రోల్‌ వేరియంట్‌ రూ.18,600, సీఎన్‌జీ అయితే రూ.22,400 చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌తో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్, క్రూయిజ్‌ కంట్రోల్, ఫాలో మీ హోమ్‌ ఫంక్షన్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను ఈ కారుకు పొందుపరిచారు.

సీఎన్‌జీ వేరియంట్‌లోనూ ఇది లభిస్తుంది. ప్యాడల్‌ షిఫ్టర్స్‌తో అత్యాధునిక 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్‌ వేరియంట్‌ లీటరుకు 20.51 కిలోమీటర్లు, సీఎన్‌జీ కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ‘పదేళ్ల క్రితం ఎర్టిగా విడుదల భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఒక ముఖ్యమైన క్షణం. ఇది కొత్త విభాగాన్ని సృష్టించింది. ఈ విభాగం ఏటా సగటున 4.7% వృద్ధి చెందుతోంది’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు.  

ఎక్స్‌ఎల్‌6 కొత్త వెర్షన్‌..
ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమలో మల్టీ పర్పస్‌ వెహికల్స్‌ (ఎంపీవీ) విభాగం వాటా 2014–15లో 4–5 శాతమే. ప్రస్తుతం 8–9 శాతానికి చేరింది. అన్ని కంపెనీలు కలిపి నెలకు సుమారు 22,000 యూనిట్లు విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో సంస్థ వాటా దాదాపు రెండింతలై 61 శాతానికి ఎగబాకిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్‌ సీనియర్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.   ఈ నెలాఖరులో ఎక్స్‌ఎల్‌6 కొత్త వర్షన్‌ రానుందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు