Maruti Suzuki ఫలితాల్లో అదుర్స్‌: ఏకంగా నాలుగు రెట్ల లాభం

28 Oct, 2022 16:20 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ  క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబరు త్రైమాసికంలో  నికర లాభం 4 రెట్లు పెరిగి రూ.2,062 కోట్లకు చేరుకుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 475.30 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు  ఎగిసింది. (షావోమి యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌: ఆ సేవలిక బంద్‌!)

గత ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు రూ.19,297.80 కోట్లనుంచి రూ.28,543.50 కోట్లకు వార్షిక ప్రాతిపదికన 47.91 శాతం వృద్ధి చెందాయి. ఆపరేటింగ్ ఎబిట్ గత ఏడాది త్రైమాసికంలో రూ.98.80 కోట్ల నుంచి 20.71 రెట్లు పెరిగి రూ.2,046.30 కోట్లకు చేరుకుంది. అలాగే  ఈ త్రైమాసికంలో ఎబిట్ మార్జిన్ 670 బేసిస్ పాయింట్లు పెరిగి 0.5 శాతం నుంచి 7.2 శాతానికి చేరుకుంది. ఖర్చు తగ్గింపు ప్రయత్నాలు, అనుకూలమైన విదేశీ మారకపు వైవిధ్యం తమకు లాభించిందని పేర్కొంది.

అయితే ఎలక్ట్రానిక్ భాగాల కొరత కారణంగా ఈ త్రైమాసికంలో దాదాపు 35,000 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. ఈ  త్రైమాసికం ముగిసే సమయానికి 4.12 లక్షల వాహనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 1.3 లక్షల వాహనాల ప్రీ-బుకింగ్‌లు ఇటీవల లాంచ్ చేసిన మోడళ్లకు సంబంధించినవేనని మారుతి వెల్లడించింది. ఈ ఫలితాల జోష్‌తో మారుతి సుజుకి షేరు ఆరుశాతం ఎగిసి  9,548  వద్ద ఇన్వెస్టర్లకు లాభాల పంట  పండించింది.

మరిన్ని వార్తలు