స్టార్టప్‌లకు శుభవార్త ? రంగంలోకి గూగుల్‌!

28 Oct, 2021 09:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ద్వితీయ శ్రేణి నగరాలు, జిల్లా కేంద్రాల్లో స్టార్టప్‌లపై పని చేస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శుభవార్త. అంకుర పరిశ్రమగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారికి సాయం చేసేందుకు గూగుల్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన మైటీ స్టార్టప్‌ హబ్‌తో గూగుల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

యాప్‌స్కేల్‌
కేంద్రానికి చెందిన మైటీ, గూగుల్‌కు కలిసి యాప్‌స్కేల్‌ అకాడమీని ప్రారంభించనున్నాయి. ఈ అకాడమీ  ద్వారా అత్యంత నాణ్యమైన యాప్స్‌ను భారతీయ స్టార్టప్స్‌ అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తుంది. గేమింగ్, హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్‌తోపాటు సామాజికంగా ప్రభావం చూపే యాప్స్‌ అభివృద్ధిపై అకాడమీ దృష్టిసారిస్తుంది.

డిసెంబరు 15 వరకు
యాప్‌స్కేల్‌ అకాడమీ సాయం పొందేందుకు స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబరు 15 వరకు అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న ‍స్టార్టప్‌లు మైటీ వెబ్‌పోర్టల్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్తమంగా ఉన్న వంద స్టార్టప్‌లను దేశవ్యాప్తంగా ఎంపిక చేస్తారు. వీటికి యాప్‌స్కేల్‌ అకాడమీ ద్వారా అవసరమైన మద్దతు అందిస్తారు.

ఆరు నెలల పాటు
ఎంపిక చేసిన స్టార్టప్‌లు నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. రెగ్యులర్‌గా వెబినార్లు నిర్వహిస్తూ నిధుల సమీకరణ, సెక్యూరిటీ విధానాలు, యూఎక్స్‌ డిజైన్స్‌ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఈ కార్యక్రమం  జిల్లా కేంద్రాలు, టైర్‌ టూ సిటీల్లో ఉ‍న్న స్టార్టప్‌లకు మేలు చేస్తుందని కేంద్రం చెబుతోంది.

చదవండి: 'గ్రీన్‌ పవర్‌ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే

మరిన్ని వార్తలు