ఎస్‌బీఐతో బెంజ్‌ జట్టు: ప్రత్యేక ఆఫర్లు

24 Nov, 2020 15:28 IST|Sakshi

మెర్సిడెస్  బెంజ్‌ కార్ల కొనుగోళ్లపై ఎస్‌బీఐ ఆఫర్లు

సాక్షి,ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భాగస్వామ్యాన్నికుదుర్చుకుంది. తద్వారా తన వినియోగదారులకు ఆకర్షణీయమైన వడ్డీరేటుతోపాటు,  ఇతర ప్రయోజనాలను కల్పించనుంది. అలాగే ఎస్‌బీఐ యోనో ద్వారా కార్లను కొనుగోలు చేసినవారికి అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. 

తమ లగ్జరీ కార్లను బుక్ చేసుకున్న ఎస్‌బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీరేట్లకే కార్ల ఫైనాన్సింగ్‌, ఇతర అనేక ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బెంజ్‌ మంగళవారం తెలిపింది. అలాగే ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా బెంజ్‌ కార్లను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. బెంజ్ కారును బుక్ చేసుకునే వినియోగదారులందరికీ డీలర్‌షిప్‌ల వద్ద రూ.25 వేల అదనపు ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. డిసెంబర్ 31 వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. 

మెర్సిడెస్ బెంజ్  కొత్త కస్టమర్లను చేరుకోవడానికి కొత్త మార్గాలను నిరంతరం అన్వేషిస్తోందనీ, అలాగే  ఒక బ్యాంకుతో టై అప్‌ కావడం ఇదే మొదటిసారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ అండ్‌ సీఈవొ మార్టిన్ ష్వెంక్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలోని మొత్తం 17 సర్కిల్‌లలోని ఎస్‌బీఐ హెచ్‌ఎన్‌ఐ(అధిక నికర-విలువ గల వ్యక్తులు) కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ సహకారంతో ఆఫర్లను అందిస్తున్నామని ఎస్‌బీఐ రీటైల్ అండ్‌ డిజిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ సెట్టి చెప్పారు. పండుగ సీజన్‌లో ఈ అవకాశాన్నిఉపయోగించుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు