Mercedes- Benz: ఐదేళ్లలో తొలిసారిగా..! మెర్సిడెజ్‌ బెంజ్‌ స్థానం ఆ కంపెనీ కైవసం..!

8 Jan, 2022 21:24 IST|Sakshi

2021గాను ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌-బెంజ్‌కు అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదిలో వాహనాల విక్రయాల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెజ్‌ బెంజ్‌కు ఉన్న క్రేజ్‌ను 2021గాను బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. గత ఏడాదిగాను లగ్జరీ కార్ల కేటాగిరీలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా బీఎండబ్ల్యూ నిలిచింది.    

తగ్గిన అమ్మకాలు..!
ఐదేళ్ల తరువాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్ముడైన ప్రీమియం లగ్జరీ కార్లలో బెంజ్‌ మొదటిస్థానాన్ని కోల్పోయింది.  2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.05 మిలియన్ వాహనాలను మెర్సిడెజ్‌ బెంజ్‌ విక్రయించినట్లు తెలుస్తోంది. అదే ఏడాదిగాను సుమారు రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ వాహనాల అమ్మకాలను బీఎండబ్ల్యూ జరిపింది. ప్రీమియం కార్లలో మెర్సిడెజ్‌-బెంజ్‌ స్థానాన్ని బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది.

మరోవైపు అనూహ్యంగా ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాల్లో మెర్సిడెజ్‌ బెంజ్‌ 90 శాతం మేర అధికంగా అమ్మకాలను జరపడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బెంజ్‌ సుమారు 99,301 ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించింది. యూరప్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈ ఏడాదిగాను అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఇది దాదాపు 11.2 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలో  విక్రయాల్లో అతి తక్కువ వృద్ధిని మెర్సిడెస్-బెంజ్  సాధించింది. 2021గాను అమెరికాలో  0.4 శాతం పెరుగుదలను నమోదుచేసింది. 

బీఎండబ్ల్యూ అమ్మకాల్లో భారత్‌లో భేష్‌..!
2021 భారత్‌లో బీఎండబ్ల్యూ  గణనీయమైన అమ్మకాలను  జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్‌ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్‌ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. 

చదవండి: రేసింగ్‌ స్పోర్ట్స్ బైక్స్‌లో సంచలనం..! అందులోనూ ఎలక్ట్రిక్‌ బైక్‌..! ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 235 కి.మీ..!

మరిన్ని వార్తలు