సోలార్‌ పవర్‌లో భారత్‌ రికార్డ్‌ ! మెర్కామ్‌ ఇండియా రీసెర్చ్‌ వెల్లడి

10 Dec, 2021 15:19 IST|Sakshi

మూడు రెట్లు పెరిగిన సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి

జనవరి–సెప్టెంబర్‌ మధ్య నమోదు 

7.4 గిగావాట్ల అదనపు సామర్థ్యం  

న్యూఢిల్లీ: దేశీయంగా సోలార్‌ ఆధారిత విద్యుదుత్పత్తి శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ కాలంలో ఏకంగా మూడు రెట్లకు పైగా (335 శాతం) అదనపు సామర్థ్యం.. అంటే 7.4 గిగావాట్లు కొత్గగా సమకూరినట్టు మెర్కామ్‌ ఇండియా రీసెర్చ్‌ ఓ నివేదిక రూపంలో తెలిపింది. ఏడాది క్రితం (2020) ఇదే కాలంలో 1.73 గిగావాట్ల సామర్థ్యమే ఏర్పడినట్టు పేర్కొంది. ‘‘2021 మూడో క్వార్టర్‌లో (జూలై–సెప్టెంబర్‌) 2,835 మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం కొత్తగా సమకూరింది. అంతకుముందు జూన్‌ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 14 శాతం అధికం. వార్షికంగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన సామర్థ్యంతో పోలిస్తే 547 శాతం అధికం’’ అని వివరించింది. ముడి సరుకుల తయారీ వ్యయాలు పెరగడం, మాడ్యూళ్ల అందుబాటు, ధరల్లో ఎన్నో అస్థితరలు, కొన్ని రాష్ట్రాల్లో రవాణా చార్జీలు పెరగడం వంటి సవాళ్లు ఉన్నా కానీ సోలార్‌ ఇన్‌స్టాలేషన్లు పెరిగినట్టు తెలిపింది.  

2022లోనూ జోరే 
‘‘విడిభాగాల అధిక ధరలు, రాజస్థాన్‌లో ట్రాన్స్‌మిషన్‌ అంశాలు ఉన్నా కానీ.. 2022 సంవత్సరం కూడా ఇన్‌స్టాలేషన్ల పరంగా ఎంతో బలంగా ఉంటుంది. చెల్లింపుల సమస్యలు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు వృద్ధికి అవరోధాలుగా ఉన్నాయి. మోనో పెర్క్‌మాడ్యూళ్ల ధరలు సగటున 15 శాతం పెరిగాయి. ఒక్కో కంటెయినర్‌ చార్జీలు కూడా 9,000 డాలర్లకు పెరిగింది’’ అని మెర్కామ్‌ క్యాపిటల్‌ గ్రూపు సీఈవో రాజ్‌ప్రభు తెలిపారు. 2022 ఏప్రిల్‌ నుంచి 40 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని అమలు చేయనుండడంతో దేశీయ తయారీదారులు దీన్నుంచి లబ్ది పొందేందుకు ఇన్‌స్టాలేషన్లను వేగంగా ఏర్పాటు చేస్తున్నట్టు మెర్కామ్‌ వివరించింది. దిగుమతులు ప్రియం కానున్నందున వచ్చే ఏడాది రెండో త్రైమాసికం నుంచి కొనుగోళ్ల విధానాల్లో సమూల మార్పు చోటు చేసుకోనున్నట్టు అంచనా వేసింది.   

చదవండి: సోలార్‌ రంగంలో పెట్టుబడుల వెల్లువ

మరిన్ని వార్తలు