ఆసియాలోనే ఫస్ట్‌ మెటా ఆఫీస్‌.. భారతీయుల శిక్షణ కోసమే!

9 Dec, 2021 07:22 IST|Sakshi

గురుగ్రామ్‌: ఆసియాలోనే అతిపెద్ద కేంద్రంగా పరిగణిస్తున్న కార్యాలయాన్ని ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మెటా (గతంలో ఫేస్‌బుక్‌) బుధవారం ప్రారంభించింది.  ఫేస్‌బుక్‌ కంపెనీ మెటాగా పేరు మార్చేసుకున్న తర్వాత ప్రారంభించిన మొదటి ఆఫీస్‌ ఇదే కావడం విశేషం.  


ఇది సీ ఫైన్‌(C-FINE) కేంద్రానికి వేదిక కానుంది. తద్వారా వచ్చే మూడేళ్లలో  భారత్‌లోని కోటి మంది చిన్న వ్యాపారులకు, 2,50,000 మంది ఆవిష్కర్తలకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు మెటా ప్రకటించింది.  1.3 లక్షల చదరపు అడుగులతో, ఆరు ఫ్లోర్‌ల బిల్డింగ్‌తో ఈ కార్యాలయం.. అమెరికాలోని మెలానో పార్క్‌లో సంస్థ ప్రధాన కార్యాలయంను పోలి ఇది ఉండడం గమనార్హం. ఇక మెటా(ఫేస్‌బుక్‌ కంపెనీ) 2010లో హైదరాబాద్‌లో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. 

‘‘భారత్‌ ఫేస్‌బుక్‌కు మాత్రమే అతిపెద్ద కేంద్రంగా లేదు. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌కూ కీలకమైన దేశంగా ఉంది. భారత్‌లో మా అతిపెద్ద బృందానికే కాకుండా, బయటి ప్రపంచానికీ ఇది కేంద్రంగా ఉంటుంది’’ అని ఫేస్‌బుక్‌ (మెటా) వైస్‌ ప్రెసిడెంట్, ఎండీ అజిత్‌ మోహన్‌ తెలిపారు. దేశంలో వాట్సాప్‌ను 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌ను 41 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 21 కోట్ల మంది వినియోగిస్తున్నట్టు అంచనా.
 

చదవండి: ఫేస్‌బుక్‌కు షాక్‌.. 10 లక్షల కోట్లకు దావా వేసిన రొహింగ్యాలు

మరిన్ని వార్తలు