మెటా పాలసీ హెడ్‌ రాజీవ్‌ అగర్వాల్‌ రిజైన్‌..శాంసంగ్‌లో చేరిక!

16 Nov, 2022 16:41 IST|Sakshi

మాజీ మెటా ఇండియా పాలసీ హెడ్‌ రాజీవ్‌ అగర్వాల్‌ సౌత్‌ కొరియన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం శాంసంగ్‌లో చేరినట్లు బ్లూమ్‌ బర్గ్‌ తెలిపింది. వారం రోజుల క్రితం ఖర్చు తగ్గించుకునేందుకు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ 11,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించారు. ఆ తొలగింపుల తర్వాత మెటా సంస్థలో పలు కీలక పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. వివిధ దేశాలకు చెందిన మెటా కంట్రీ హెడ్‌లు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. రాజీనామా చేసిన వారిలో భారత్‌కు చెందిన పాలసీ హెడ్‌ రాజీవ్‌ అగర్వాల్‌ ఒకరు.   

మంగళవారం మెటా ఇండియా పాలసీ హెడ్‌ రాజీవ్‌ అగర్వాల్‌, వాట్సాప్‌ ఇండియా హెడ్‌ అభిజిత్‌ బోస్‌లు తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ మెటా అధికారికంగా ప్రకటించింది. 

ఆ మరుసటి రోజు అంటే ఇవాళ శాంసంగ్‌లో చేరినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనుండగా..రాజీవ్‌ అగర్వాల్‌ శాంసంగ్‌లో సైతం పాలసీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. కాగా, రాజీవ్ అగర్వాల్ గతంలో ఉబెర్ టెక్నాలజీస్‌లో దక్షిణాసియా పాలసీ హెడ్‌గా పనిచేశారు. ఉబెర్‌కు రాజీనామా  చేసి మెటాలో చేరారు. 

మరో సంస్థలో అవకాశం కోసమే 
రాజీవ్ అగర్వాల్, అజిత్ మోహన్ ఇద్దరు తమ పదవులకు ఎందుకు రాజీనామా చేశారో మెటా తెలిపింది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ తమ కాంపిటీటర్‌లో చేరేందుకు తన పదవికి రిజైన్‌ చేశారని మెటా పేర్కొంది. ఇక అజిత్ మోహన్‌ మరో సంస్థ అవకాశం కోసమే అజిత్ మెటా నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారంటూ’ మెటా  గ్లోబల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ నికోలా మెండెల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి👉 :  మెటా ఉద్యోగులకు ఊహించని షాక్‌, మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన!

మరిన్ని వార్తలు