లేఆఫ్‌ల ట్రెండ్‌.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్‌బర్గ్‌ సెక్యూరిటీకి ఏకంగా 115 కోట్ల ఖర్చు!

16 Feb, 2023 13:50 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఫేస్‌బుక్‌ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, సహ వ్యవస్థాపకుడు  మార్క్‌ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచింది. జుకర్‌బర్గ్‌కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్సును ఏకంగా 4 మిలియన్‌ డాలర్లు పెంచి 14 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.115  కోట్లు) చేసింది. 

ప్రస్తుతం పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతోపాటు జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ సముచితం, అవసరమైనవేనని మెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఓ వైపు ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతూ మరోవైపు జుకర్‌బర్గ్‌కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచడం చర్చనీయాంశమైంది.

ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 16వ ర్యాంక్‌లో ఉన్న జకర్‌బర్గ్‌ 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. అయితే గత సంవత్సరానికి సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మెటా మరిన్ని ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నందునే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
(ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌! ఏప్రిల్‌ 1 నుంచే ఐటీఆర్‌ ఫైలింగ్‌..)

మరిన్ని వార్తలు