ఆర్ధిక మాంద్యం భయాలు.. ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్‌!

15 Jan, 2023 20:16 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ సంస్థలు భారీ ఎత్తున ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగించడం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. పనిలో పనిగా ఆఫీసుల్ని ఖాళీ చేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా మెటా, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు కార్యాలయాల్ని ఖాళీ చేసినట్లు సీటెల్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 

ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా, మైక్రోసాఫ్ట్ విడివిడిగా వాషింగ్టన్‌లోని సీటెల్, బెల్లేవ్‌లోని కార్యాలయ భవనాలను ఖాళీ చేస్తున్నాయి.టెక్ సెక్టార్‌లో మార్పులు, ఆఫీస్‌ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకుల మధ్య సీటెల్‌లోని అర్బోర్ బ్లాక్ 333లో ఆరు అంతస్తులు,బెల్లేవ్‌లోని స్ప్రింగ్ డిస్ట్రిక్ట్‌ బ్లాక్ 6లో 11అంతస్తుల తన కార్యాలయాలను సబ్‌లీజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మెటా ధృవీకరించినట్లు సీటెల్ టైమ్స్ నివేదించింది.

కాలిఫోర్నియాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం మెన్లో పార్క్‌తో పాటు ఇతర సీటెల్ ప్రాంత కార్యాలయ భవనాల లీజులను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. మెటాతో పాటు మైక్రోసాఫ్ట్‌ సైతం జూన్ 2024లో లీజు ముగిసే సమయానికి సిటీ సెంటర్ ప్లాజా బెల్లేవ్‌లోని 26 అంతస్తుల భవన లీజు పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకోవడం లేదని ధృవీకరించింది.

రిమోట్‌ వర్క్‌, భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులు, టెక్‌ రంగంలో మందగమనం కారణంగా సీటెల్, ఇతర ప్రాంతాలలో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను తగ్గించాయని సీటెల్ టైమ్స్ పేర్కొంది. ఈ సందర్భంగా మెటా ప్రతినిధి ట్రేసీ క్లేటన్ సీటెల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. లీజింగ్ నిర్ణయాలు, రిమోట్‌ వర్క్‌, ఆర్ధిక మాంద్యం భయాలకు అనుగుణంగా మెటా తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని అంగీకరించారు.

చదవండి👉‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’

>
మరిన్ని వార్తలు