మైక్రోమాక్స్ బిగ్ అనౌన్స్ మెంట్

16 Oct, 2020 19:04 IST|Sakshi

కొత్త బ్రాండ్‌తో దూసుకొస్తున్న మైక్రోమాక్స్

'ఇన్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌

సాక్షి, ముంబై: ఒకపుడు  దిగ్గజంగా వెలిగిన దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేందుకు  సిద్ధపడుతోంది.  దేశంలో చైనా ఉత్పత్తులపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో   మైక్రోమాక్స్ సరికొత్త వ్యూహాలతో   మార్కెట్లోకి రీఎంట్రీ  ఇవ్వనుంది. ఈమేరకు మైక్రోమాక్స్ సీఈవో రాహుల్ శర్మ ఒక వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు.  పోటీ మార్కెట్ లో చైనా మొబైల్ సంస్థలు  వస్తే.. ఒకే కానీ, సరిహద్దులో అనిశ్చితి  సరైనది కాదు అంటూ ఆయన చైనాపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

మధ్య తరగతి కుటుంబంలో, ఒక సామాన్య ఉపాధ్యాయుడి కుమారుడిగా తన వ్యాపార ప్రస్థానాన్నిఈ వీడియోలో వివరించారు. ప్రపంచంలో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచిన  మైక్రోమాక్స్ జర్నీని ప్రస్తావించారు. అయితే   కొన్ని పొరపాట్లు జరిగినా,  తాను ఓడిపోకపోయినా, సాధించిన దానితో సంతృప్తి చెందానని  చెప్పుకొచ్చారు. కానీ సరిహద్దు వద్ద ఏమి జరిగిందో అది సరైనది కాదన్నారు. ఏం చేయాలి.. ఎవరికోసం  చేయాలి అని చాలా ఆలోంచించాను.. అయితే ఎక్కడినుంచి మొదలు పెట్టానో.. మళ్లీ అక్కడ్నించే మొదలు పెట్టే అవకాశాన్ని జీవితం ఇచ్చింది. కానీ ఈసారి ఏం చేసిన దేశం కోసం మాత్రమే  చేస్తానని రాహుల్ ప్రకటించారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిభర్ భారత్ పిలుపులో భాగంగా ఇండియా కోసం మైక్రోమాక్స్ 'ఇన్' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌తో తిరిగి వస్తోందని వెల్లడించారు. భారతదేశంలో కొత్త ఇన్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలకు సూచికగా బ్లూ బాక్స్ ను  కూడా  వీడియోలో షేర్ చేశారు.  

ఇంతకుమించి వివరాలను ఆయన ప్రకటించపోయినప్పటికీ, 7-15 వేల రూపాయల ధరల మధ్య ఉత్పత్తులను మైక్రోమాక్స్ లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. నవంబర్ ఆరంభంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ధరలో ఆవిష్కరించనుందని టెక్ నిపుణుల అంచనా.  ఇందుకోసం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. 

మరిన్ని వార్తలు