ప్లూటన్‌తో విండోస్‌ పీసీ హ్యాకర్లకు చెక్‌

18 Nov, 2020 14:43 IST|Sakshi

కొత్త సెక్యూరిటీ ప్రాసెసర్‌ చిప్‌ ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్‌

ఏఎండీ, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌ సహకారంతో అభివృద్ధి

ఇక విండోస్ పీసీలలో కొత్త సెక్యూరిటీ ప్రాసెసర్‌ చిప్‌

న్యూయార్క్‌: గ్లోబల్‌ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తాజాగా సెక్యూరిటీ ప్రాసెసర్‌ చిప్‌ను ఆవిష్కరించింది. ప్లూటన్‌ పేరుతో కొత్తగా అభివృద్ధి చేసిన ఈ చిప్‌ విండోస్‌ పీసీలకు మరింత భద్రతను చేకూర్చనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ఈ కొత్త సెక్యూరిటీ చిప్‌ను సిలికాన్‌ దిగ్గజాలు ఇంటెల్‌, ఏఎండీ, క్వాల్‌కామ్‌ సాంకేతిక సహకారంతో రూపొందించినట్లు తెలియజేసింది. తద్వారా విండోస్‌ పీసీలలోని నెక్ట్స్‌ జనరేషన్‌ హార్డ్‌వేర్‌కు మరింత భద్రతను కల్పించనున్నట్లు వివరించింది.

సీపీయూలతో..
మైక్రోసాఫ్ట్‌ ప్లూటన్‌ను భవిష్యత్‌ సీపీయూలలో అంతర్గతంగా ఏర్పాటు చేయనున్నట్లు ఓఎస్‌ సెక్యూరిటీ ఎంటర్‌ప్రైజ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ వెస్టన్‌ తెలియజేశారు. తద్వారా హార్డ్‌వేర్‌, క్రిప్టోగ్రాఫిక్స్‌ భద్రతకు వినియోగించే ట్రస్ట్‌డ్‌ ప్లాట్‌పామ్‌ మాడ్యూల్‌(టీపీఎంలు)ను ఈ చిప్‌ రీప్లేస్‌ చేయనున్నట్లు వివరించారు. ఈ ఆధునిక సెక్యూరిటీ ప్రాసెసర్‌(ప్లూటన్‌) హ్యాకర్ల నుంచి మరింత భద్రతను చేకూరుస్తుందని పేర్కొన్నారు. తద్వారా హ్యాకర్లు ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో భాగంగా అంతర్గతంగా దాక్కునేందుకు లేదా.. ఫిజికల్‌ ఎటాక్స్‌ చేసేందుకు కష్టమవుతుందని తెలియజేశారు. క్రెడిన్షియల్‌, ఎన్‌క్రిప్షన్‌ కీస్‌ వంటివి చోరీ చేయడాన్ని ఈ చిప్‌ అరికడుతుందని వివరించారు. అంతేకాకుండా సాఫ్ట్‌వేర్‌ బగ్స్‌నుంచి రికవరీ సాధించేందుకు సైతం తోడ్పడుతుం‍దని పేర్కొన్నారు. వెరసి కమ్యూనికేషన్‌ చానల్‌పై దాడి అవకాశాలకు చెక్‌ పెడుతుందని చెప్పారు. గత పదేళ్లుగా టీపీఎంలు విండోస్‌కు మద్దతిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు