మైండ్‌ట్రీ లాభం జూమ్‌...

14 Jan, 2022 02:16 IST|Sakshi

క్యూ3లో రూ. 437 కోట్లు

31,959కు సిబ్బంది సంఖ్య

1.2 బిలియన్‌ డాలర్లకు ఆర్డర్‌బుక్‌

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ మైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3)లో నికర లాభం 34% జంప్‌చేసి రూ. 437 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 326 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 36 శాతం పురోగమించి రూ. 2,750 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,024 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది.  

డాలర్ల రూపేణా
ఈ ఏడాది క్యూ3లో మైండ్‌ట్రీ డాలర్ల రూపేణా 58.3 మిలియన్‌ డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇది 32 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 34 శాతం పుంజుకుని 366.4 మిలియన్‌ డాలర్లకు చేరింది. డిసెంబర్‌ చివరికల్లా కంపెనీ యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య 265ను తాకగా.. 31,959 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తాజా త్రైమాసికంలో 4,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది. వచ్చే ఏడాది(2022–23)లో క్యాంపస్‌ల ద్వారా మరింత మందిని ఎంపిక చేసుకోనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్‌ చటర్జీ పేర్కొన్నారు. గత 12 నెలల్లో ఉద్యోగ వలసల రేటు 21.9 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. కోయంబత్తూర్, వరంగల్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో మైండ్‌ట్రీ షేరు బీఎస్‌ఈలో 2.4% లాభపడి రూ. 4,744 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు