ఇక్కడ మొబైల్‌లో చూస్తే.... అక్కడ కాసులు వర్షం

23 Jun, 2021 11:43 IST|Sakshi

ఇండియాలో పెరిగిన వీడియో కంటెంట్‌ వినియోగం

కంప్యూటర్లు, టీవీల స్థానం ఆక్రమిస్తోన్న స్మార్ట్‌ఫోన్లు

బ్రాండ్‌ ప్రమోషన్లకు మొబైల్‌ ఫోన్ల వైపు చూస్తోన్న కంపెనీలు

క్రమంగా పెరుగుతున్న మొబైల్‌ ఫోన్‌ బేస్డ్‌ యాడ్‌ రెవిన్యూ 

వెబ్‌డెస్క్‌: ఇండియాలో రోజురోజుకి పెరిగిపోతున్న మొబైల్‌ వాడకం, వీడియో కంటెంట్‌ ప్రొవైడర్లకు కాసుల పంట పండుతోంది. గంటల తరబడి మనం మొబైల్‌ ఫోన్‌కి అతుక్కుపోతుంటే వీడియో ప్రొవైడర్ల ఇంట కాసుల వర్షం కురుస్తోంది. 

36 కోట్ల మంది 
ఇండియా జనాభా 136 కోట్లు ఉండగా ఇందులో 36 కోట్ల మంది ప్రజలు మొబైల్‌ ఫోన్లలో గంటల తరబడి గడిపేస్తున్నారు. సోషల్‌ మీడియా, ఓటీటీ, ఆన్‌లైన్‌ క్లాసులు, వర్చువల్‌ మీటింగుల్లో మునిగిపోతున్నారు. లాక్‌డౌన​ తర్వాత ఇదీ మరీ ఎక్కువైంది.  దాదాపు అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది వివిధ కారణాల మొబైల్స్‌కే అతుక్కుపోతున్నారు.దీంతో వ్యాపార వర్గాలను వీళ్లను టార్గెట్‌ చేస్తున్నాయి. మొబైల్‌ వీడియో కంటెంట్‌ ఊతంగా తమ బ్రాండ్ల ప్రమోషన్‌కి బాటలు వేస్తున్నాయి. 

194 శాతం వృద్ధి
కరోనా కల్లోలం వచ్చిన తర్వాత జనాలంతా ఇంటి పట్టునే ఉండటడంతో మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఓటీటీ, సోషల్‌ మీడియాలో వీడియో కంటెంట్‌ చూసే వాళ్లలో 62 శాతం మంది మొబైల్‌ ఫోన్లలే ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మొబైల్‌ వీడియో కంటెంట్‌ ఆధారిత అడ్వర్‌టైజ్‌మెంట్‌ మార్కెట్‌ ఊపందుకుంది. కేవలం రెండేళ్లలోనే ఈ మార్కెట్‌ 194 శాతం వృద్ధిని సాధించిందని ఏషియా పసిఫిక్‌కి చెందిన వసుత అగర్వాల్‌ తెలిపారు. 

మొబైల్‌కే ప్రియారిటీ 
ఇక మొబైల్‌ ఫోన్‌లో సెర్చింజన్‌ నుంచి చూసేవాళ్లకంటే డెడికేటెడ్‌ యాప్‌ల ద్వారా చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మిగిలిన ఫార్మట్లతో పోల్చితే వీడియో కంటెంట్‌ అందించే యాప్‌లపై వాణిజ్య , వ్యాపార సంస్థలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. యాప్‌ల ద్వారా బ్రాండ్‌ ప్రమోషన్‌కి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఇక్కడ గ్రోత్‌ రేట్‌ 112 శాతంగా నమోదు అవుతోంది. టీవీలు, కంప్యూటర్లులలో కంటే మొబైల్‌ఫోన్లలలో వీడియో కంటెంట్‌ నాలుగింతలు ప్రభావంతంగా ఉంటోంది. అందుకు తగ్గట్టే యాడ్‌ రెవిన్యూ కూడా క్రమంగా మొబైల్‌ ఆధారిత వీడియో కంటెంట్‌ ప్రొవైడర్లకు దక్కుతోంది. 
 

చదవండి : కార్వీ స్కామ్‌, తీసుకున్న రుణాలు ఎగ్గొట్టేందుకు కుట్ర..?!

మరిన్ని వార్తలు