మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు మూడు రెట్లు

26 Aug, 2021 07:46 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ మొబైల్‌ ఫోన్‌ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్‌–జూన్‌)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. 

ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు 

మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. 
 
ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది.
  
ఇక ఇదే కాలంలో మొబైల్‌ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్‌టైమ్‌ కనిష్ట స్థాయి ఇది.
  
కాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది.  

మరింత పురోగతికి చర్యలు...
మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్‌ వాటా కావాలన్నది సంకల్పం.

     – పంకజ్‌ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్‌  

చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! 

                                                                                                                                                                                   

మరిన్ని వార్తలు