డబ్బు సంపాదించేందుకు మార్గాలు ఎన్నో(తప్పుడు దోవలో కాకుండా) ఉన్నాయి. కావాల్సిందల్లా ఉన్నపెట్టుబడిలో తెలివి, శ్రమను సరిగ్గా ఉపయోగించడం. ఒకప్పుడు తన వీడియోలను లెక్క పెట్టుకుంటూ గడిపిన (2017లో కౌంటింగ్ టు 1, 00, 000 వీడియోతో ఫేమస్ అయ్యాడు).. జిమ్మీ డొనాల్డ్సన్, ఇప్పుడు ఏడాదికి 400 కోట్ల రూపాయలు సంపాదించే ఇంటర్నెట్ పర్సనాలిటీగా గుర్తింపు దక్కించుకున్నాడు.
జిమ్మీ డొనాల్డ్సన్.. ఈ పేరు చెబితే ఈ యూట్యూబర్ గురించి తెలియదు. మిస్టర్బీస్ట్ అని పిలిస్తే మాత్రం చాలామంది గుర్తు పడతారు. యూట్యూబ్లో విలువైన స్టంట్ల ద్వారా పేరు దక్కించుకున్న అమెరికన్ ఇతను. 13 ఏళ్ల వయసులో యూట్యూబ్లో వీడియోలు పోస్ట్ చేయడం ఆరంభించి.. ఛాలెంజ్, డొనేషన్ల వీడియోలతో వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యాడు.
ఫోర్బ్స్ జాబితాలో 2021 ఏడాదికి గానూ 23 ఏళ్ల జిమ్మీ డొనాల్డ్సన్ ‘యూట్యూబ్ హయ్యెస్ట్ ఎర్నింగ్ కంటెంట్ క్రియేటర్’గా నిలిచాడు. తన వీడియోలకు పది బిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకుని.. 54 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైనే) వెనకేసుకున్నాడు. ముఖ్యంగా ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో భారీ స్టేడియంలో అతను నిర్వహించిన హైడ్ అండ్ సీక్ ఆటకు భారీ స్పందన లభించింది. కిందటి ఏడాది మిస్టర్బీస్ట్ ఈ లిస్ట్లో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 45 మిలియన్ డాలర్ల సంపాదనతో జేక్ పాల్ రెండో స్థానంలో నిలిచాడు.
మనసున్నోడు కూడా..
డొనాల్డ్సన్ యూట్యూబ్ ఛానెల్కి 88 మిలియన్ పైగా సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. మిస్టర్ బీస్ట్ కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు.. పరోపకారి కూడా. యూట్యూబ్లో సంపాదించిన దానిని మాత్రమే కాదు.. ఎన్జీవోలు, ఆర్గనైజేషన్లు, దాతల ద్వారా వచ్చినదంతా ఇతరులకు దానం చేస్తుంటాడు. ఇళ్లు లేనివాళ్లకు, జబ్బులతో బాధపడుతున్నవాళ్లకు, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరికైనా సరే సడన్ సర్ప్రైజ్లతో సాయం చేస్తుంటాడు. 2018 డిసెంబర్లో లక్ష డాలర్లను ఇళ్లు లేని వాళ్లకు దానం చేయడం, గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి ఆర్థిక సాయం, ఆస్పత్రులకు విరాళం.. లాంటివెన్నో ఉన్నాయి. కిందటి ఏడాది ‘మిస్టర్ బీస్ట్ బర్గర్’ (వర్చువల్ రెస్టారెంట్చెయిన్)ను స్థాపించి.. యాభై మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు ఈ కుర్రాడు.