ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌!

29 Aug, 2022 15:37 IST|Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 45వ ఏజీఎం సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ..వచ్చే ఏడాది నాటికి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగం అంటే వెహికల్స్‌ను తయారు చేయడం కాదు. వాటికి అవసరమైన పరికరాల్ని రిలయన్స్‌ను తయారు చేయనుంది. ఇందుకోసం గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్‌ అంబానీ తెలిపారు. 

మనదేశంలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఉపయోగించే లిథియం అయాన్‌ బ్యాటరీ ఉత్పత్తి చాలా తక్కువ. అందుకే స్థానిక ఆటోమొబైల్‌ కంపెనీలు విదేశాల నుంచి ఆ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి. తద్వారా దేశీయ ఈవీ వెహికల్స్‌ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. రిలయన్స్‌ ఇప్పుడు ఆ అవసరాన్ని తగ్గించేందుకు గిగా ఫ్యాక్టరీలో కార్యకలాపాల్ని ప్రారంభించనుంది.      

ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్‌ "బ్యాటరీ మెటీరియల్‌ల నుండి సెల్ తయారీ వరకు ఎండ్-టు-ఎండ్ బ్యాటరీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, సురక్షితమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను అందించడమే మా ఆశయం. "కెమిస్ట్రీ, మెటీరియల్స్‌పై లోతైన అవగాహన, పరిజ్ఞానం ప్రపంచ స్థాయిలో బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడుతుందన్నారు. కాగా,  రిలయన్స్‌ గిగా ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో వినియోగించే ఎలక్ట్రిక్‌ బ్యాటరీ, సోలార్‌ ప్యానళ్లు, ఫ్యూయల్‌ సెల్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎనర్జీ బ్యాటరీలను తయారు చేయనుంది. 
 
మా లక్ష్యం అదే 
"గత సంవత్సరం, నేను నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించడానికి జామ్‌ నగర్‌లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాను. ఈ రోజు, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం మా కొత్త గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేస్తున్నట్లు ముఖేష్‌ అంబానీ వెల్లడించారు. 2023 నాటికి ఈ గిగా ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఉపయోగించే బ్యాటరీలు (బ్యాటరీ ప్యాక్స్‌) తయారు చేయడం ప్రారంభిస్తాం.2024 నాటికి 5జీడబ్ల్యూహెచ్‌ ఎలక్ట్రిక్‌ బ్యాటరీలను తయారు చేసే దిశగా, 2027 నాటికి వార్షిక సామర్థ్యాన్ని 50 జీడబ్ల్యూహెచ్‌ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ముఖేష్‌ అంబానీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు