మరోసారి ఆసియా కుబేరుడిగా అంబానీ

26 Feb, 2021 19:50 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ మరోసారి ఆసియా కుబేరుడిగా అవతరించారు. చైనా బిలియనీర్‌ జాంగ్‌ షంషన్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. 80 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కాగా చైనాకు చెందిన అలీబాబా గ్రూపు అధినేత జాక్‌ మాను తోసిరాజని అంబానీ, గత రెండేళ్ల కాలంలో అత్యధిక రోజులు ఆసియా రిచెస్ట్‌ పర్సన్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది డిసెంబరులో అనూహ్యంగా లాభాల పట్టిన చైనీస్‌ బిజినెస్‌ టైకూన్‌ షంషన్‌ సుమారు 98 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీని వెనక్కి నెట్టారు. 

తన కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ బీజింగ్‌ వాంటాయి బయోలాజికల్‌ ఫార్మసీ ఎంటర్‌ప్రైజ్‌, నోన్గ్‌ఫూ బీవరేజ్‌ కంపెనీ షేర్లలో పెరుగుదల నమోదు కావడంతో ఈ మేరకు ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేగాక, వారెన్‌ బఫెట్‌ను అధిగమించి ఈ భూమ్మీద ఉన్న అత్యంత ఆరో సంపన్న వ్యక్తిగా ఘనతకెక్కారు. అయితే, తాజా బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం... షంషన్‌ గత వారం రోజుల్లోనే 22 బిలియన్‌ డాలర్ల మేర సంపద నష్టపోయారు. దీంతో ముకేశ్‌ అంబానీ ఆయన స్థానాన్ని ఆక్రమించారు. ప్రస్తుతం షంషన్‌ ఆస్తి 76.6 బిలియన్‌ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

చదవండిఅంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ

మరిన్ని వార్తలు