మళ్లీ ముకేశ్‌ టాప్‌

9 Oct, 2020 04:37 IST|Sakshi
ముకేశ్, గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌

ఫోర్బ్స్‌ ఇండియా కుబేరుల్లో వరుసగా పదమూడోసారి అగ్రస్థానం

సంపద విలువ రూ. 6,56,000 కోట్లు

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. సుమారు 8,870 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 6,56,000 కోట్లు) సంపదతో ఫోర్బ్స్‌ ఇండియా 2020 కుబేరుల లిస్టులో వరుసగా పదమూడోసారీ నంబర్‌ వన్‌గా నిల్చారు. గౌతమ్‌ అదానీ, శివ్‌ నాడార్‌ ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నారు.

వంద మంది సంపన్నుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో దివీస్‌ ల్యాబ్స్‌ ఎండీ మురళి దివి, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రమోటర్ల కుటుంబం, మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ చైర్మన్‌ పీపీ రెడ్డి , అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డి ఉన్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ టాప్‌ 100 సంపన్నుల్లో సగం మంది సంపద గణనీయంగానే పెరిగిందని ఫోర్బ్స్‌ వెల్లడించింది. ‘వీరందరి సంపద గతేడాదితో పోలిస్తే 14 శాతం పెరిగి 51,700 కోట్ల డాలర్లకు చేరింది‘ అని పేర్కొంది. ముకేశ్‌ అంబానీ సంపద మరో 3,730 కోట్ల డాలర్లు పెరిగిందని వివరించింది.

మరిన్ని వార్తలు