Reliance AGM 2021: రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక ప్రకటనలు

24 Jun, 2021 17:58 IST|Sakshi

గ్లోబల్ సంస్థగా రిలయన్స్ ఆవిర్భావం

కరోనాపై పోరుకు రిలయన్స్‌ ‘5 మిషన్స్‌’ 

ప్రముఖ డిజిటల్ సంస్థగా జియో ప్లాట్‌ఫాం

గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 60,000 కోట్ల పెట్టుబడులు

సెప్టెంబర్ 10న మార్కెట్లోకి జియో ఫోన్ నెక్స్ట్

జియో 5జి స్పీడ్ 1 జీబీపీఎస్

ముంబై: దేశంలో అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం అట్టహాసంగా కొనసాగింది. కోవిడ్ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో-విజువల్ మార్గాల ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్లను ఊదేశిస్తూ కీలక ప్రకటనలు చేశారు. అంతే కాదు కోవిడ్ పోరాటంలో ముందుండి నిలిచిన సంస్థ ఉద్యోగుల, కరోనా పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, నీతా అంబానీలు నివాళులర్పించారు.

ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. "మేము దేశం గురించి, మా ఉద్యోగుల గురించి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సంస్థ, చాలా మంది ఉద్యోగులు, వాటాదారులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వారి కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. మహమ్మారి తర్వాత కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్ మంచి పనితీరు" కనబరిచిందన్నారు. గత వార్షిక సర్వసభ్య సమావేశం నుంచి ఇప్పటి వరకు మా వ్యాపారం, ఫైనాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగిందని ఆయన అన్నారు. ఈ కష్ట కాలంలో మానవాళికి సేవ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము. కరోనా కాలంలో రిలయన్స్ కుటుంబం గొప్ప పని చేసింది, ఈ కారణం చేత మన వ్యవస్థాపక చైర్మన్ ధీరూభాయ్ అంబానీ ఈ రోజు మన గురించి గర్వపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

44వ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక ప్రకటనలు..

 

  • ఇషా అంబానీ: ఈ రోజు మా తాత గారు ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారు. దేశంలోని ప్రతి వ్యక్తికి మా సంస్థ తరుపున అవసరమైన వారికి సహాయం అందించాం. మన దేశానికి సేవ చేయడానికి తమ వంతు కృషి చేసినట్లు తెలిపారు.

  • నీతా అంబానీ: ఈ సంవత్సరం మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ అని పేరుతో మహిళల కోసం ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాము. ఇది సమగ్ర, సహకార, ఇంటరాక్టివ్, సామాజిక స్పృహ ఉన్న డిజిటల్ ఉద్యమం. ఈ సంవత్సరం ఉమెన్ కనెక్ట్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించడానికి రిలయన్స్ ఫౌండేషన్ యుఎస్‌ఐఐడితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 

  • నీతా అంబానీ: మహమ్మారికి వ్యతిరేకంగా మన దేశం చేస్తున్న పోరాటంలో రిలయన్స్ ఫౌండేషన్ చేస్తున్న సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. గత 15 నెలల్లో ముఖేష్, నేను ఈ కష్ట సమయాల్లో మన దేశానికి, మన ప్రజలకు సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. కరోనాతో పోరాడటానికి రిలయన్స్ ఫౌండేషన్ ఐదు మిషన్లను ప్రారంభించింది. మిషన్ ఆక్సిజన్, మిషన్ కోవిడ్ ఇన్ఫ్రా, మిషన్ అన్నా సేవా, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురాక్ష.
  • మిషన్ ఆక్సిజన్‌: ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ కేసులు భారీగా పెరగడంతో భారతదేశం ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంది. రిలయన్స్ వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకుంది. సాంప్రదాయకంగా, మేము ఎప్పుడూ మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయలేదు. అయినప్పటికీ అవసరం వచ్చినప్పుడు, అధిక స్వచ్ఛత కలిగిన మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి, మేము మా జామ్‌నగర్ రిఫైనరీని కొన్ని రోజుల్లో పునర్నిర్మించాము. రెండు వారాల్లోనే మేము రోజుకు 1100 మెట్రిక్ టన్నుల భారీ ఉత్పత్తిని పెంచాము అని పేర్కొంది.
  • నిజానికి పూర్తి స్థాయిలో సామర్థ్యం ఉన్న కొత్త మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సాధారణంగా ఒక సంవత్సరం పడుతుంది. కానీ మా రిలయన్స్ ఇంజనీర్ల, సూపర్-హ్యూమన్ ప్రయత్నంతో అతి స్వల్పమైన సమయంలో ఇది సాధ్యమయ్యేలా చేశారు. 10 రోజులలోపు 85,000 కంటే ఎక్కువ పని-గంటలలో ఉద్యోగులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
  • మిషన్ కోవిడ్ ఇన్ఫ్రా: కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి కీలకమైనది కోవిడ్ సంరక్షణ మౌలిక సదుపాయాలు పెంపొందించడం. మిషన్ కోవిడ్ ఇన్ఫ్రా భారీగా మౌలిక సదుపాయాలు పెంపోదించడానికి ప్రయత్నించాము. గత సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి చెందిన కొద్ది రోజుల్లోనే భారతదేశపు మొట్టమొదటి 250 పడకల COVID ఆసుపత్రి సదుపాయాన్ని ముంబైలో ఏర్పాటు చేసాము అని అంది. సెకండ్ వేవ్ తాకిన సమయానికి, కేవలం ముంబైలో మాత్రమే కోవిడ్ సంరక్షణ కోసం అదనంగా 875 పడకలను ఏర్పాటు చేసాము. 

  • ముఖేష్ అంబానీ: రిలయన్స్ కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గత సంవత్సరంలో దాదాపు 75,000 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ఆర్‌ఐఎల్ భారతదేశపు అతిపెద్ద వస్తువుల ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ప్రైవేటు రంగంలో కస్టమ్స్ ,ఎక్సైజ్ సుంకాలను అత్యధికంగా చెల్లించే కార్పోరేట్ సంస్థగా ఉంది. మేము ప్రైవేటు రంగంలో అత్యధిక జీఎస్టీ, వ్యాట్ & ఐటీ చెల్లింపుదారులలో ముందు వరుసలో నిలిచాము. మేము గత సంవత్సరంతో పోలిస్తే ఈక్విటీ క్యాపిటల్‌లో రూ .3.24 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాము. రిటైల్ వాటాదారులు రైట్ ఇష్యూపై 4x రాబడిని పొందడం ఆనందంగా ఉంది.కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కంపెనీ పనితీరు అత్యుత్తమంగా ఉంది. మా వినియోగదారుల వ్యాపారాల నుంచి గణనీయమైన పెరుగుదలతో మా ఏకీకృత ఆదాయం దాదాపు 5,40,000 కోట్లు చేరింది.
  • జియో ప్లాట్‌ఫాం భారతదేశంలో ప్రముఖ డిజిటల్ సంస్థగా నిలిచింది. అంతేకాదు జియో ప్లాట్‌ఫామ్ ఎఫ్‌వై 21 ఆదాయం రూ.86,493 కోట్లు, EBITDA ఆదాయం రూ .32,359 కోట్లుగా నిలిచింది. జియో ఎఫ్‌వై 21 సమయంలో 37.9 మిలియన్ల మంది నూతన సబ్ స్క్రయిబర్లను చేర్చింది, 22 సర్కిల్‌లలో 19 లో రెవెన్యూ మార్కెట్ లీడర్గా ఉంది. జియో ప్లాట్‌ఫాంలు, రిటైల్, రైట్స్ ఇష్యూ, ఈక్విటీ ద్వారా మార్కెట్ కాపిటల్ రూ.3,24,432 కోట్లు దాటింది. సావరిన్ వెల్త్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీలు తరలి రావడం ద్వారా రిలయన్స్ అభివృద్ధి దేశ వృద్ధి సామర్థ్యం పట్ల ప్రపంచ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించింది.
  • రిలయన్స్ వ్యూహాత్మక భాగస్వామిగా సౌదీ అరాంకోను ఆహ్వానిస్తుంది. సౌదీ అరాంకో ఛైర్మన్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ స్వతంత్ర డైరెక్టర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో చేరడం సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ ఫైనాన్స్, టెక్నాలజీలో ఆయన కృషి చాలా విలువైనది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీగా సౌదీఅరాంకోకు పేరు ఉంది. అంతేకాదు అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన ఈ సంస్థ అనుభవం నుండి మేము ఎంతో ప్రయోజనం పొందుతామని నాకు తెలుసు. యాసిర్ అల్-రుమయ్యన్ మా బోర్డులో చేరడం కూడా రిలయన్స్ అంతర్జాతీయీకరణకు నాంది.
  • జామ్‌నగర్‌లోని 5,000 ఎకరాల్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసే పనిని మేము ప్రారంభించామని మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సౌకర్యాలలో ఒకటి అవుతుంది.
  • రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ: రిలయన్స్ ఇంటిగ్రేటెడ్ ఫోటో వోల్టాయిక్ ఫ్యాక్టరీని నిర్మిస్తుంది. మేము ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీని నిర్మిస్తాము. మేము ఒక అధునాతన శక్తి నిల్వ బ్యాటరీ ఫ్యాక్టరీని నిర్మిస్తాము. రాబోయే 3 సంవత్సరాల్లో కొత్త గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 60,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాం
  • గూగుల్, జియో సంయుక్తంగా అభివృద్ధి చేసిన జియో ఫోన్ నెక్స్ట్ ను సెప్టెంబర్ 10న ప్రారంభించినట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. గూగుల్, జియో సంయుక్తంగా జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేశాయి. జియో స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్, ఆటోమేటిక్ రీడ్, ట్రాన్స్ లేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌లతో గల స్మార్ట్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 
  • జియో 5జి టెక్నాలజీని పరీక్షించింది. టెస్టింగ్ సమయంలో 1జీబీపీఎస్ వేగాన్ని తాకినట్లు పేర్కొంది. దేశంలోనే పూర్తి స్థాయి 5జీ సేవలను ప్రారంభించిన మొదటి నెట్ వర్క్ రిలయన్స్ జియోనే సంస్థ ప్రకటించింది. 5జీ పరికరాల అభివృద్ధి కోసం ప్రపంచ భాగస్వాముల సహకారం తీసుకున్నట్లు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వినోదం, రిటైల్ రంగాలలో పెనుమార్పులు సంభవిస్తాయని వివరించింది.
  • రిలయన్స్ రిటైల్: ద్వారా రాబోయే మూడేళ్లలో రిటైల్ సంస్థ 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అంబానీ తెలిపారు. 3 సంవత్సరాలలో 1 కోటి మంది కొత్త విక్రేతలను చేర్చుకోవాలని భావిస్తున్నామన్నారు. వచ్చే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో 3 రెట్ల వృద్ధిని ఆశిస్తున్నామన్నారు. "ప్రపంచంలోని టాప్ 10 రిటైలర్లలో ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నాను" అని అంబానీ ఆశించారు.

  • సుందర్‌ పిచాయ్‌: ‘‘గూగుల్‌ క్లౌడ్‌, జియో మధ్య కుదిరిన 5జీ భాగస్వామ్యం దాదాపు 100 కోట్ల మంది భారతీయులకు వేగవంతమైన ఇంటర్నెట్‌ అందిస్తుంది. ఇది వారి డిజిటల్‌ మార్పులు, వ్యాపారాలకు సహకరిస్తుంది. తర్వాతి తరం భారత్‌ డిజిటలైజేషన్‌కు పునాది వేస్తుంది. భారత్‌లో వ్యాపారాలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే మా ఒప్పందం లక్ష్యం’’

చదవండి: గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో 60,000 కోట్ల పెట్టుబడులు 

మరిన్ని వార్తలు