మామూలు లక్‌ కాదండోయ్‌, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!

27 Sep, 2022 14:06 IST|Sakshi

తక్కువ వ్యవధిలో తమ పెట్టుబడికి అధికంగా లాభాలు రావాలని ఏ ఇన్వెస్టరైనా భావిస్తాడు. అయితే అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలానే ఉన్నప్పటికీ సరైన ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. అందుకే, లాభాలనిచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. తాజాగా అలాంటి స్టాక్‌ గురించి తెలుసుకోబోతున్నాం. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌ (Gensol Engineering Ltd ).. గత 3 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్‌లలో ఒకటిగా నిలివడంతో పాటు ఇన్వెస్టర్లకు కాసులు కురిపించింది.

జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌ దేశీయంగా, అంతర్జాతీయంగా సౌర ప్రాజెక్టుల కోసం సేవలను అందిస్తుంది. అహ్మదాబాద్, ముంబైలలో కార్యాలయాలతో, సంస్థ 18 రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇది కెన్యా, చాడ్, గాబన్, ఈజిప్ట్, సియెర్రా లియోన్, యెమెన్, ఒమన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో ప్రస్తుత ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది.

వామ్మో.. రూ. లక్షకి 20 లక్షలు
ఇటీవల జెన్‌సోల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ షేర్లు రూ. 1,390.65 వద్ద ముగిశాయి. అయితే అంతకుముందు షేర్‌ రూ.1,426.45 వద్ద ముగిసింది. క్రితంతో  పోలిస్తే ప్రస్తుతం 2.51% తగ్గింది. ఈ మల్టీబ్యాగర్‌ స్టాక్‌ని గమనిస్తే దీని ధర గత మూడేళ్లలో గణనీయంగా పెరిగింది. బహుశా ఈ స్థాయిలో పెరుగుతుందని అందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఊహించిఉండరేమో.

ఈ షేర్‌ ధరపై ఓ లుక్కేస్తే..  గత మూడేళ్లలో అంటే 18 అక్టోబర్, 2019 నాటికి స్టాక్ ధర ₹63.41గా ఉండేది. ప్రస్తుతం అమాంతం పెరిగిన ఈ స్టాక్ రూ.1,390.65కి చేరుకుంది. ఈ కాలంలో ఇది 2,093.11% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. అంటే మూడు సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో ₹ 1 లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ₹ 21.93 లక్షల రాబడినిచ్చింది. ఇదే షేర్‌ ఒక సంవత్సరంలో రూ. 67 నుంచి ₹ 1,390కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ 1,948.69% రాబడిని ఇస్తూ ఇన్వెస్టర్లకి కాసుల పంట కురిపించిందనే చెప్పాలి.  ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడు ఈ మొత్తం రూ.20 లక్షలకు పెరిగింది.

ఇటీవలే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), భారత ప్రభుత్వం, బ్రైత్‌వైట్ & కో. లిమిటెడ్ (BCL) సహా క్లయింట్‌ల నుంచి రూ. 531 కోట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఆర్డర్‌లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో దాదాపు 121 MWp సామర్థ్యంతో నిర్మించనున్నారు.

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

మరిన్ని వార్తలు