మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల్లో భారీ వృద్ధి

10 Apr, 2021 05:45 IST|Sakshi

2020–21లో 41% పెరుగుదల

రూ.31.43 లక్షల కోట్లకు ఇన్వెస్టర్ల పెట్టుబడులు

ముంబై: స్టాక్‌ మార్కెట్ల చక్కని ర్యాలీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు కలిసొచ్చింది. ఫలితంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు) నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడులు (ఆస్తులు/ఏయూఎం) ఏకంగా 41 శాతం పెరిగి రూ.31.43 లక్షల కోట్లకు చేరాయి. వాస్తవానికి 2021 ఫిబ్రవరి నాటికి తొలి 11 నెలల్లో ఏయూఎం రూ.31.64 లక్షల కోట్ల వరకు పెరగ్గా.. ఆ తర్వాత డెట్‌ విభాగం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా మార్చి ఆఖరుకు రూ.31.43 లక్షల కోట్లకు పరిమితమైంది. డెట్‌ విభాగం నుంచి మార్చి మాసంలో రూ.52,528 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. డెట్‌ విభాగంలో లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి రూ.19,384 కోట్లు, లో డ్యూరేషన్‌ ఫండ్స్‌ నుంచి రూ.15,847 కోట్లు బయటకు వెళ్లగా.. కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ మాత్రం రూ.69,305 కోట్లను ఆకర్షించినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు