ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్‌!

25 Mar, 2023 16:06 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌కు అత్యంత ఆదరణ తీసుకొచ్చింది బిగ్‌బిలియన్‌ డేస్ సేల్. ఇది దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ షాపింగ్ ఫెస్టివల్‌. ఈ సేల్‌ నిర్వహించినప్పుడు కొనుగోళ్లు విపరీతంగా ఉంటాయి. కారణం ఈ సమయంలో లభించే ఆఫర్లు. అయితే ఈ బిగ్‌బిలియన్‌ డేస్ సేల్ సృష్టికర్త ఎవరో తెలుసా?  

మింత్రా దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మార్కెట్‌ ప్లేస్‌లలో ఒకటి. వాల్-మార్ట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఒక సూపర్ ఉమన్‌ సీఈవోగా ఉన్నారు. ఆమే నందితా సిన్హా. అంచెలంచెలుగా ఎదిగి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ అయ్యారు.

నందితా సిన్హా 2022 జనవరి 1న మింత్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. ఈ-కామర్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాలలో ఆమెకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె బ్రిటానియా లో కూడా పనిచేశారు. సమ్మర్ ట్రైనీగా ప్రారంభించి 2009లో కస్టమర్ మేనేజర్‌గా నిష్క్రమించారు. ఐదేళ్లపాటు హెచ్‌యూఎల్‌లో కొనసాగారు. బ్రిటానియాలో ఆమె ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. మీడియా ప్లానింగ్, కమ్యూనికేషన్‌కు బాధ్యత వహించారు. ఆ తరువాత ఆమె మైబేబీకార్ట్‌ (MyBabyCart.com) అనే ఈ-కామర్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు.

నందితా సిన్హా 2013లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. ఆ తర్వాత ఆ కంపెనీ మింత్రాను కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లింది. నందితా సిన్హా ఎనిమిదేళ్లకుపైగా ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నారు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆమె కస్టమర్ల ఆకర్షణ, గ్రోత్‌ ఫంక్షన్‌కు నాయకత్వం వహించారు. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఆమె పాత్ర కీలకమైనది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నడిపించింది ఈమే.

మింత్రా సీఈవో కావడానికి ముందు నందితా సిన్హా కస్టమర్ గ్రోత్, మీడియా, ఎంగేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. లక్నోకు చెందిన ఆమె ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారనాసీ (బనారస్ హిందూ యూనివర్సి​టీ) నుంచి బీటెక్ చేసిన ఆమె ప్రతిష్టాత్మక ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎఫ్‌ఎంఎస్) నుంచి మార్కెటింగ్ అండ్‌ స్ట్రాటజీలో ఎంబీఏ చేశారు.

మరిన్ని వార్తలు