India Infrastructure: రండి.. భారత్‌లో పెట్టుబడులు పెట్టండి!

4 May, 2022 08:02 IST|Sakshi

డెన్మార్క్‌ కంపెనీలకు, పెన్షన్‌ ఫండ్స్‌కు ప్రధాని మోదీ పిలుపు 

కోపెన్‌హెగెన్‌: భారత మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ డెన్మార్క్‌ కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని మెట్‌ ఫ్రెడరిక్సెన్‌తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 

భారత్‌లో ఇప్పటికే 200కు పైగా డెన్మార్క్‌ కంపెనీలు పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యాపార సులభతర నిర్వహణ చర్యలతో ప్రయోజనం పొందుతున్నట్టు వివరించారు. ‘‘డెన్మార్క్‌ కంపెనీలు, డెన్మార్క్‌ పెన్షన్‌ ఫండ్స్‌కు భారత మౌలికరంగంతోపాటు పర్యావరణ అనుకూల (గ్రీన్‌) పరిశ్రమల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి’’ అని ప్రకటించారు.

అంతకుముందు ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తృతిపై చర్చలు నిర్వహించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తృతి చేసుకోవాలన్న అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. రెన్యువబుల్‌ ఎనర్జీ, టెర్మినళ్లు, పోర్టుల ఆధునికీకరణ, విస్తరణ, ఆహార శుద్ధి, ఇంజనీరింగ్‌ రంగాల్లో డెన్మార్క్‌ పెట్టుబడులకు ఇరువురు నేతలు పిలుపునిచ్చినట్టు ఈ ప్రకటన తెలియజేసింది. 

చదవండి👉‘డిజిటల్‌ ఇండియా ఇన్‌సైడ్‌’ నినాదం మార్మోగాలి!

మరిన్ని వార్తలు