మొండిబాకీల వసూళ్లు,లైసెన్సు కోసం సన్నాహాలు

14 Jul, 2021 07:39 IST|Sakshi

న్యూఢిల్లీ: మొండిబాకీల వసూళ్ల కోసం ఉద్దేశించిన బ్యాడ్‌ బ్యాంక్‌ (నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ–ఎన్‌ఏఆర్‌సీఎల్‌)ని ముంబైలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా లాంఛనాలు పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నాయి. తదుపరి ఆర్‌బీఐ నుంచి అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఏఆర్‌సీ)గా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందని వివరించాయి. కెనరా బ్యాంకు సారథ్యంలోని ప్రభుత్వ  బ్యాంకులకు ఇందులో మెజారిటీ వాటాలు ఉంటాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌ మొదలైనవి మూలధనం సమకూర్చే అవకాశాలు ఉన్నాయి.

ఎన్‌ఏఆర్‌సీఎల్‌ మూలధనం రూ. 7,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో కేంద్రం నేరుగా వాటాలు తీసుకోకపోయినప్పటికీ ఎన్‌ఏఆర్‌సీఎల్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసీట్స్‌కు పూచీకత్తు మాత్రం ఇస్తుంది. ఇందుకు ప్రభుత్వం రూ. 31,000 కోట్లు కేటాయించింది. బ్యాంకుల నుంచి మొండిబాకీలను కొనుగోలు చేసి, వాటిని రికవర్‌ చేయడంపై ఎన్‌ఏఆర్‌సీఎల్‌ కసరత్తు చేస్తుంది. దీనికి బదలాయించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే రూ. 82,500 కోట్ల విలువ చేసే 22 అసెట్స్‌ను గుర్తించాయి. 
 

మరిన్ని వార్తలు