‘ఆధార్‌పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’

25 Nov, 2021 08:19 IST|Sakshi

నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో ఆర్‌ఎస్‌ శర్మ 

న్యూఢిల్లీ: గోప్యతను కాపాడే పేరుతో ఆధార్‌ వినియోగంపై విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ ఆంక్షలు విధించడం సరికాదని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో ఆర్‌ఎస్‌ శర్మ విమర్శించారు. దీని వల్ల నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డేటా వాల్ట్‌ అనేది.. ఆధార్‌ ప్రధాన లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని యూఐడీఏఐ తొలి డైరెక్టర్‌ జనరల్‌ అయిన శర్మ పేర్కొన్నారు.

అధీకృత ఏజెన్సీలు అన్నీ సేకరించిన ఆధార్‌ నంబర్లు అన్నింటినీ కేంద్రీకృతంగా భద్రపర్చేందుకు డేటా వాల్ట్‌ అనే కాన్సెప్టును యూఐడీఏఐ ఇటీవల ప్రకటించింది. ఆయా సంస్థల వ్యవస్థల్లో ఆధార్‌ నంబర్లు నిక్షిప్తమై ఉండిపోకుండా, అనధికారికంగా ఇతరుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. మరోవైపు, వ్యక్తుల గుర్తింపును ధృవీకరించేందుకు స్మార్ట్‌ఫోన్‌లను ’యూనివర్సల్‌ ఆథెంటికేటర్లు’గా వినియోగంలోకి తేవడంపై కసరత్తు చేస్తున్నట్లు యూఐడీఏఐ సీఈవో సౌరభ్‌ గర్గ్‌ తెలిపారు. అయితే, దీన్ని ఏ విధంగా అమల్లోకి తేనున్నది వెల్లడించలేదు. ప్రస్తుతం వేలిముద్రలు, ఐరిస్, వన్‌–టైమ్‌ పాస్‌వర్డ్‌ను ధృవీకరణకు ఉపయోగిస్తున్నారు.
 

చదవండి: ఆధార్ కార్డ్‌ వినియోగదారులకు శుభవార్త, ఆధార్‌ నెంబర్‌తో మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు

>
మరిన్ని వార్తలు