సామాన్యులకు భారీ షాక్.. మరింత పెరగనున్న గ్యాస్ ధరలు

12 Sep, 2021 19:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికే పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుంటే మరోపక్క ఎల్‌పీజీ గ్యాస్, వంట నూనె వంటి నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడు బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, సామాన్యులపై వచ్చే నెలలో మరో భారం పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. వచ్చే నెల అక్టోబర్‌ నెలలో గ్యాస్‌ సిలిండర్ ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు ఏకంగా 57 - 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: ఆ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త!)

ఒకవేల గ్యాస్‌ సిలిండర్‌ ధరలు నిజంగానే పెరిగితే ఇక వాటిని కొనాలంటే సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన డొమెస్టిక్ గ్యాస్ పాలసీ నియమాల ప్రకారం.. ప్రతి 6 నెలలకు ఒకసారి నేచురల్ గ్యాస్ ధరలను సమీక్షిస్తుంది. అయితే, ఈ సమీక్షలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే వచ్చే నెలలో దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అధిక మొత్తంలో పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర మీ.మీ.బీ.టీ.యుకు 1.79 డాలర్‌గా ఉంటే ఇది వచ్చే నెల 3 డాలర్ల పైకి పెరగవచ్చు అనే అంచనాలున్నాయి. విదేశీ మార్కెట్‌లో నేచురల్ గ్యాస్ ధర సెప్టెంబర్ 8న ఒక్క రోజే 8 శాతం పెరిగింది.

మరిన్ని వార్తలు