హైదరాబాద్‌లో ఎన్‌సీఎల్‌డోర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌

26 Jun, 2021 07:47 IST|Sakshi

ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లకు ఉపయోగకరం

ఫ్యాక్టరీ వరకు వెళ్లకుండానే ప్రొడక్ట్‌ ని పరిశీలించే  అవకాశం 

హెదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం ఎన్‌సీఎల్‌ గ్రూప్‌లో భాగమైన ఎన్‌సీఎల్‌డోర్‌ తాజాగా హైదరాబాద్‌లో తమ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను ఆవిష్కరించింది. ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కమలేష్‌ గాంధీ శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లు, ఇతరత్రా కొనుగోలుదారులు ఫ్యాక్టరీ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి, తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ కె. రవి ఈ సందర్భంగా తెలిపారు. సుమారు గంట సేపు అగ్నిని నిరోధించగలిగే ఫైర్‌–రెసిస్టెంట్‌ డోర్‌ సహా నేచురా తదితర నాలుగు సిరీస్‌లకు చెందిన తలుపులు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్టాండర్డ్‌ సైజులతో పాటు కస్టమరు కోరిన విధంగాను తలుపులను రూపొందించి, అందిస్తున్నామని రవి తెలిపారు. వీటి తయారీ కోసం రోజుకు 1,000 డోర్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ తలుపుల ధర రూ. 10,000 నుంచి రూ. 25,000 దాకా ఉంటుందని, అయిదేళ్ల పాటు వ్యారంటీ ఉంటుందని రవి వివరించారు. మరింత తక్కువ ధరల శ్రేణిలో కూడా రెడీమేడ్‌ డోర్లను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నామన్నారు.

క్యూ4లో రూ. 29 కోట్ల లాభం
ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 29 కోట్ల లాభం (కన్సాలిడేటెడ్‌) ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 76 కోట్లు. మరోవైపు, సమీక్షాకాలంలో ఆదాయం రూ. 249 కోట్ల నుంచి రూ. 410 కోట్లకు పెరిగింది. షేర్‌హోల్డర్లకు ఇప్పటికే చెల్లించిన 30 శాతం మధ్యంతర డివిడెండ్‌కు అదనంగా మరో 10 శాతం (షేరు ఒక్కింటికి రూ. 1) డివిడెండ్‌ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎన్‌సీఎల్‌ షేరు 3% పెరిగి దాదాపు రూ. 235 వద్ద ముగిసింది. 

చదవండి : Zomato: జొమాటో కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు