జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎన్‌సీఎల్‌ఏటీలో ఊరట

29 May, 2023 04:46 IST|Sakshi

న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలను సూచిస్తూ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తన వాదనలు వినిపించేందుకే ఎన్‌సీఎల్‌టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్‌సీఎల్‌టీకి పంపించింది.

సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇతర షేర్‌హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్‌పూర్‌ గోల్డ్‌ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ .. విలీన స్కీముపై ఎన్‌సీఎల్‌టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పిటీషన్‌ వేయడంతో నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ తాజా ఆదేశాలు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు