జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం బదిలీకి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

14 Jan, 2023 06:17 IST|Sakshi

బాకీల చెల్లింపునకు మరింత గడువు

ముంబై: దివాలా తీసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్య హక్కులను జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియానికి బదిలీ చేసే ప్రతిపాదనకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. అలాగే రుణదాతలు, ఉద్యోగులు మొదలైన వారికి బాకీలు చెల్లించడానికి మరికొంత సమయం ఇచ్చింది. దీంతో బాకీల చెల్లింపునకు కన్సార్షియానికి మే నెల వరకూ వ్యవధి లభించింది. గతంలో ఈ గడువు 2022 నవంబర్‌ 16గా ఉండేది. కన్సార్షియం, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దివాలా పరిష్కార ప్రక్రియ కింద జెట్‌ ఎయిర్‌వేస్‌ను జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2021 జూన్‌లో ఆమోదించిన ప్రణాళిక ప్రకారం బ్యాంకులు రూ. 7,807 కోట్ల మేర బాకీలను వదులుకునేందుకు (హెయిర్‌కట్‌) అంగీకరించాయి. రుణదాతలకు చెల్లింపులతో పాటు వ్యాపారానికి కన్సార్షియం రూ. 1,375 కోట్ల మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్‌ యాజమాన్య హక్‌ులను తమకు బదిలీ చేయాలని, బాకీల చెల్లింపునకు మ రింత సమయం ఇవ్వాలని ఎన్‌సీఎల్‌టీని కన్సార్షి యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ప్రతివాదులు కోరినప్పటికీ ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది.  

మరిన్ని వార్తలు