కల్పతరులో జేఎంసీ విలీనానికి ఓకే

22 Dec, 2022 06:14 IST|Sakshi

తాజాగా ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం కల్పతరు పవర్‌ ట్రాన్స్‌మిషన్‌లో నిర్మాణ రంగ అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్టŠస్‌ విలీనానికి దారి ఏర్పడింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) తాజాగా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో సంయుక్త సంస్థ దేశీయంగా అతిపెద్ద లిస్టెడ్‌ ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు కల్పతరు పేర్కొంది. ఎన్‌సీఎల్‌టీ అహ్మదాబాద్‌ బెంచ్‌ జేఎంసీ విలీనానికి అనుమతించినట్లు వెల్లడించింది.

సంయుక్త సంస్థ దేశీయంగా భారీ కార్యకలాపాలు కలిగి ఉండగా.. 67 దేశాలలోనూ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. విద్యుత్‌ ప్రసారం, పంపిణీ, బిల్డింగులు, ఫ్యాక్టరీలు, వాటర్, రైల్వేలు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తదితర పలు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు వివరించింది. ఆర్డర్‌ బుక్‌ రూ. 43,000 కోట్లకు చేరనున్నట్లు తెలియజేసింది. కాగా.. 2022 ఫిబ్రవరిలో కల్పతరు, జేఎంసీ బోర్డులు విలీనానికి ఆమోదముద్ర వేశాయి. దీనిలో భాగంగా జేఎంసీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 4 షేర్లకుగాను 1 కల్పతరు షేరుని కేటాయిస్తారు.

మరిన్ని వార్తలు