టొరంట్‌కు ఎన్‌సీఎల్‌టీ రిలీఫ్‌

6 Jan, 2023 06:24 IST|Sakshi

రిలయన్స్‌ క్యాప్‌ రిజల్యూషన్‌పై స్టే

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయ అంశాన్ని ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ తాజాగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఆర్‌క్యాప్‌ కొనుగోలుకి హిందుజా గ్రూప్‌ చివర్లో దాఖలు చేసిన సవరించిన బిడ్‌పై స్టే ఆర్డర్‌ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం.. ఆర్‌క్యాప్‌ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ. 8,640 కోట్ల బిడ్‌తో టొరంట్‌ గ్రూప్‌ గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది.

అయితే తదుపరి హిందుజా గ్రూప్‌ రూ. 9,000 కోట్లకు సవరించిన బిడ్‌ను డిసెంబర్‌ 21న ఈవేలం ముగిశాక దాఖలు చేసినట్లు టొరంట్‌ గ్రూప్‌ ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేసింది. వేలం ముగిసిన తదుపరి రోజు హిందుజా గ్రూప్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తొలి ఆఫర్‌ను రూ. 8,100 కోట్లను తదుపరి రూ. 9,000 కోట్లకు సవరించినట్లు టొరంట్‌ గ్రూప్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క రిలయన్స్‌ క్యాప్‌ రుణదాతలు అటు టొరంట్‌ గ్రూప్, ఇటు హిందుజా గ్రూప్‌తో రిజల్యూషన్‌పై చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు