నాకొద్దీ ఉద్యోగం.. భారత్‌లో 'ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌' సునామీ!

20 Apr, 2022 21:26 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పించింది. భయానక పరిస్థితులను కళ్లకు కట్టింది. కుటుంబం విలువలేమిటో? డబ్బులు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. లాక్‌ డౌన్‌ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయాయి. కంపెనీల ఆదాయం తగ్గింది. ఉద్యోగం ఉన్నా.. వేతన జీవులకు కష్టాలు తప్పలేదు.  మనస్సుకు క్షణం ప్రశాంతత లేకుండా..టార్గెట్లు పెట్టుకొని చేస్తున్న పనితో చివరికి మిగిలేదేంటీ? సోమవారం ఉదయం పొద్దన్నే లేవడం. అక్కడి నుంచి ఉరకులు, పరుగులు. చేయలేనంత పనిభారం. టెన్షన్‌. రోగాలు. ఇదంతా దేని కోసం. ఇదిగో ఇలాంటి ఆలోచనల్లో నుంచి 'ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌' పుట్టింది.

ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌..ఉద్యోగులు తమ తమ ఉద్యోగాలకు స్వచ్చందంగా రాజీనామా సమర్పించడమే గ్రేట్ రిజిగ్నేషన్). ప్రస్తుతం ఈ ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌ అంశం భారత్‌ను కుదిపేయనుందని ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దేశంలోని దిగ్గజ కంపెనీలన్నీ దాదాపూ రెండేళ్ల తర్వాత రిటర్న్‌ టూ ఆఫీస్‌ కల్చర్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ కంపెనీలు ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌ను ఎదుర్కొనబోతున్నాయంటూ ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్ సేవల సంస్థ మైఖేల్ పేజ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2022మొత్తం భారత్‌లో దిగ్రేట్‌ రిజిగ్నేషన్‌ తీవ్రతరం కానుందని, దాదాపు 86శాతం మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తుండగా..ఇది రిక్రూటర్‌లకు సవాల్‌గా మారిందని రిపోర్ట్‌ హైలెట్‌ చేసింది.

 

నాన్‌ మానిటరీ రివార్డ్స్‌ అంటే!
జీతాలు, బోనస్‌లు, రివార్డ్‌లు ఇలా ఉద్యోగుల్ని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం. అయినప్పటికీ నాన్‌ మానిటరీ రివార్డ్స్‌ అంశం ఉద్యోగులు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాల్ని వదిలేయడానికి కారణమని తెలుస్తోంది. అంటే ఉదాహారణకు..ప్రమోషన్‌లు, కంపెనీ యూనిఫామ్స్‌, ఫ్లెక్సిబుల్‌ టైమింగ్స్‌, హెల్త్‌ కేర్‌ బెన్ఫిట్స్‌, లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ పాలసీ, ప్రాఫిట్‌ షేరింగ్‌, స్టాక్‌ ఆప్షన్‌, బోనస్‌ కమీషన్‌ కావాలని ఉద్యోగులు కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. నివేదిక ప్రకారం, మనదేశంలో గణనీయంగా 61శాతం మంది నచ్చిన ఉద్యోగంలో తక్కువ శాలరీ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. జీతం తక్కువే అయినా పర్సనల్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చేసుకుంటూ సంతోషంగా ఉండాలని భావిస్తుండగా.. ఇందుకోసం భారీ ప్యాకేజీ ఇస్తామన్న కంపెనీల ఆఫర్లను తిరస్కరిస‍్తున్నారు. ప్రమోషన్‌లు సైతం వద్దని అనుకుంటున్నారు. 

లక్షల్లో రాజీనామాలు
అన్నీ విభాగాలకు చెందిన సంస్థలు, సీనియారిటీ స్థాయిలు, వయస్సు ఇలా అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్వహించిన సర్వేలో 3,609 మంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కరోనా వల్ల మనదేశంలో రెండేళ్లకంటే తక్కువ కాలంగా ఉద్యోగం చేస్తున్న మూడింట ఒక వంతు అంటే 38శాతం మంది ఉద్యోగులకు రాజీనామా చేస్తున్నారు. వారిలో గణనీయంగా 86శాతం మంది ఉద్యోగులు రాబోయే ఆరు నెలల్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి మరో కొత్త రంగంలో ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నట్లు తేలింది. 


ఉద్యోగుల మాట వినాల్సందే!
ఈ సందర్భంగా మైఖేల్ పేజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకిత్ అగర్వాలా మాట్లాడుతూ..“ఉద్యోగుల పనిని చూసే విధానంలో కరోనా అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఉద్యోగులు పనిగంటలు, ఫ్రీడం, వర్క్‌ ఫ్లెక్సిబులిటీ ఇలా అన్నింటిలో తమకు నచ్చిన విధంగా సంస్థలు ఉండాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో సంస్థలు.. ఉద్యోగుల ఇష్టా ఇష్టాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న ఐటీ కంపెనీలు..బాబోయ్‌ వద‍్దంటున్న ఉద్యోగులు, కారణం అదే!

మరిన్ని వార్తలు