Nestle India Q1 Results: అయ్యో! ఆదాయం పెరిగినా.. నెస్లే ఇండియా నేల చూపులు

29 Jul, 2022 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022) రెండో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఆసక్తికర ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 515 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 539 కోట్లు ఆర్జించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు లాభాలను ప్రభావితం చేశాయి. కంపెనీ జనవరి–డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది.

కాగా.. మొత్తం ఆదాయం మాత్రం 16 శాతం ఎగసి రూ. 4,007 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 3,462 కోట్ల టర్నోవర్‌ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 21 శాతం పెరిగి రూ. 3,356 కోట్లకు చేరాయి. గత క్యూ1లో రూ. 2,776 కోట్లుగా నమోదయ్యాయి.  

పెట్‌ బిజినెస్‌ 
అమ్మకాల్లో వృద్ధి కొనసాగడంతో క్యూ2లో తొలిసారి రూ. 4,000 కోట్ల మార్క్‌ను దాటినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. దేశీ అమ్మకాలు 16 శాతం బలపడి రూ. 3,848 కోట్లకు చేరగా.. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో రూ. 158 కోట్లుగా నమోదయ్యాయి. స్విస్‌ మాతృ సంస్థ నుంచి పురీనా పెట్‌కేర్‌ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా పెట్‌ ఫుడ్‌ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకు రూ. 123 కోట్లకుపైగా వెచ్చించింది.

చదవండి: సంచలనం : ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ ఫోన్.. ధర ఎంతంటే!

మరిన్ని వార్తలు