ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 45 శాతం వృద్ధి

20 Jun, 2022 06:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జూన్‌ 16వ తేదీ నాటికి 45 శాతం పెరిగాయి. విలువలో రూ.3.39 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022–23 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.2,33,651 కోట్లు. భారీగా నమోదయిన ముందస్తు పన్ను వసూళ్లు ఈ స్థాయి పురోగతికి కారణమని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మొత్తం వసూళ్లలో కార్పొరేట్‌ పన్ను (సీఐటీ) విభాగానికి సంబంధించి రూ.1.70 లక్షల కోట్లకుపైగా మొత్తం నమోదయ్యింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) విభాగంలో రూ.1.67 లక్షల కోట్లకుపైగా వసూళ్లు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. వసూళ్లలో ముందస్తు పన్ను వాటా 33 శాతంపైగా పెరిగి రూ.1.01 లక్షల కోట్లకు ఎగసింది.  

మరిన్ని వార్తలు