మార్కెట్‌లోకి కొత్త బంకులు.... పెట్రోలు ధర తగ్గేనా ?

19 Jul, 2021 10:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆటో ప్యూయల్‌ మార్కెట్‌లో కొత్త పోటీకి కేంద్రం తెర లేపింది. ఇప్పటి వరకు మార్కెట్లో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ కంపెనీలకు పోటీగా మరి కొన్ని సంస్థలను మార్కెట్‌లోకి ఆహ్వానించింది. 

కొత్త ప్లేయర్లు
పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలకు తోడుగా మరో ఏడు కంపెనీలకు అనుమతులు జారీ చేసింది కేంద్రం. 2019లో మార్కెట్‌ ఫ్యూయల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నిబంధనలకు సంబంధించిన నిబంధనల సడలింపుల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చినట్టు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక పేర్కొంది. 

అనుమతి పొందినవి
పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ గ్యాస్‌, ఇథనాల్‌ వంటి ఆటో ఫ్యూయల్స్‌ అమ్మేందుకు కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ మోలాసిస్‌ కంపెనీ (చెన్నై బేస్డ్‌), అస్సాం గ్యాస్‌ కంపెనీ, ఆన్‌సైట్‌ ఎనర్జీ, ఎంకే ఆగ్రోటెక్‌, ఆర్‌బీఎంఎల్‌ సొల్యూషన్స్‌, మానస్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బల్క్‌, రిటైల్‌గా పెట్రోలు, డీజిల్‌ను అమ్మడానికి అనుమతి ఉంటుంది.

100 బంకులు
ఏడాదికి రూ. 500 కోట్ల నెట్‌వర్త్‌ కలిగిన కంపెనీల నుంచి కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. అనుమతులు సాధించిన కంపెనీలు ఐదేళ్లలో కనీసం వంద పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం బంకులను పూర్తిగా రిమోట్‌ ఏరియాల్లోనే ఏర్పాటు చేయాలనే నిబంధన కేంద్రం పొందు పరిచింది. 

వ్యాపారం జరిగేనా
ఇంధన వ్యాపారానికి సంబంధించి కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్ట్రీస్‌కి తప్ప మరే కంపెనీకి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ లేదు. అస్సాం గ్యాస్‌ కంపెనీకి మౌలిక వసతులు ఉన్నా అది కేవలం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైంది. మిగిలిన కంపెనీల్లో చాలా వరకు బల్క్‌ ఫ్యూయల్‌ సెల్లింగ్‌కే అనుకూలంగా ఉన్నాయి. 

ధర తగ్గేనా
ప్రస్తుతం ఆటో ఫ్యూయల్‌ విభాగంలో పోటీ నామామత్రంగా ఉంది. హెచ్‌పీ, ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ వంటి కంపెనీలు ఉన్నా ధరల్లో వత్యాసం లేదు. కొత్త ప్లేయర్లు మార్కెట్‌లోకి రావడం వల్ల ఫ్యూయల్‌ ధరలు ఏమైనా కిందికి దిగుతాయోమో చూడాలి.

మరిన్ని వార్తలు