కస్టమర్‌ డేటా, గోప్యత దుర్వినియోగానికి చెక్‌.. ఇకపై అలాంటివి కుదరదు!

16 Nov, 2022 09:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపాదిత డేటా రక్షణ బిల్లుతో కస్టమర్‌ డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ చెప్పారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారు కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధమైన యూజర్ల లొకేషన్‌ ట్రాకింగ్‌ వివాదానికి సంబంధించిన కేసును టెక్‌ దిగ్గజం గూగుల్‌ సెటిల్‌ చేసుకున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లొకేషన్‌ ట్రాకింగ్‌ సిస్టం నుండి వైదొలిగినప్పటికీ యూజర్లను తప్పు దోవ పట్టించి, వారి లొకేషన్‌ను ట్రాక్‌ చేయడాన్ని కొనసాగించిందంటూ గూగుల్‌పై కేసు నమోదైంది. దీన్ని 392 మిలియన్‌ డాలర్లకు గూగుల్‌ సెటిల్‌ చేసుకుంది. ఇలా కస్టమర్‌ డేటా, గోప్యత దుర్వినియోగం కాకుండా డేటా రక్షణ బిల్లు పటిష్టంగా ఉంటుందని చంద్రశేఖర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో లోక్‌సభలో పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం మరింత బలమైన నిబంధనలతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: కేం‍ద్రం భారీ షాక్‌: పది లక్షల రేషన్‌ కార్డులు రద్దు, కారణం ఏంటంటే..  

మరిన్ని వార్తలు