సెన్సెక్స్ 338 పాయింట్లు అప్- 39,312కు
నిఫ్టీ 98 పాయింట్లు జూమ్- 11,602 వద్ద ట్రేడింగ్
ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలన్నీ లాభాల్లో- ఐటీ వీక్
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం ప్లస్
ప్రోత్సాహకర ప్రపంచ సంకేతాలతో వరుసగా మూరోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 338 పాయింట్లు జంప్చేసి 39,312ను తాకగా.. నిఫ్టీ 98 పాయింట్లు ఎగసి 11,602 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,600 మార్క్ను అధిగమించింది. సోమవారం యూఎస్ మార్కెట్లు బలపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ట్రెండ్ కనిపిస్తోంది.
బ్యాంక్స్ జోరు
ఎన్ఎస్ఈలో ఐటీ 0.3 శాతం క్షీణించగా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రయివేట్, పీఎస్యూ బ్యాంక్స్, రియల్టీ, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ 2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, దివీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, టైటన్, ఐసీఐసీఐ, ఎస్బీఐ 4.5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఐవోసీ 2-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి.
ఇండిగో అప్
డెరివేటివ్ కౌంటర్లలో ఇండిగో, ఆర్బీఎల్ బ్యాంక్, గోద్రెజ్ ప్రాపర్టీస్, జిందాల్ స్టీల్, బంధన్ బ్యాంక్, ఎస్కార్ట్స్, యూపీఎల్, డాబర్, బాలకృష్ణ, బయోకాన్, దివీస్, ఎల్ఐసీ హౌసింగ్ 2.6-1.7 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. పెట్రోనెట్, వేదాంతా, అమరరాజా, నాల్కో, మైండ్ట్రీ, ఎంజీఎల్ 1.2-0.5 శాతం మధ్య నీరసించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,164 లాభపడగా.. 499 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.