సూచీలకు మాంద్యం భయం 

20 Jan, 2023 06:46 IST|Sakshi

ముంబై: ఆర్థిక మాంద్యం భయాలతో దేశీయ స్టాక్‌ సూచీల రెండురోజుల ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. కేంద్ర బడ్జెట్, రానున్న ప్రధాన కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వ్యవహరించారు. ఆటో, విద్యుత్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్‌ 187 పాయింట్లు నష్టపోయి 60,858 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 58 పాయింట్లు పతనమై 17,108 వద్ద నిలిచింది.

అయితే ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఐటీ రంగ షేర్లకు స్వల్ప  కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య కదలాడాయి. సెన్సెక్స్‌ 60,716 వద్ద కనిష్టాన్ని, 61,032 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 18,064 – 18,155 పరిధిలో కదలాడింది. అమెరికా తయారీ రంగ, రిటైల్‌ అమ్మకాలు మెప్పించకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. 

మార్కెట్లో మరిన్ని సంగతులు  

డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఏషియన్‌ పెయింట్స్‌ షేరు 3% నష్టపోయి రూ.2,868 వద్ద స్థిరపడింది. 

ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) ప్రకటన తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. బీఎస్‌ఈలో నాలుగుశాతం క్షీణించి రెండు నెలల కనిష్ట స్థాయి రూ.3462 వద్ద స్థిరపడింది.  

బలమైన ఆదాయాల వృద్ధి నమోదు ఆశలతో ఓఎన్‌జీసీ షేరు రెండు శాతం పెరిగి ఆరు నెలల గరిష్టం రూ.152 వద్ద స్థిరపడింది.

>
మరిన్ని వార్తలు