రుణానికి డిమాండ్‌ లేదని చెప్పలేం..

26 Aug, 2021 03:22 IST|Sakshi

రుణ వృద్ధిపై అక్టోబర్‌ నుంచీ బ్యాంకింగ్‌ దృష్టి

జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  

ముంబై: రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్‌ అక్టోబర్‌ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  అక్టోబర్‌ నుంచీ చేపట్టనున్న జిల్లాల వారీ చర్యలు రుణ వృద్ధికి ఊపునిస్తాయి’’ అని ఆర్థికమంత్రి ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో విశ్లేషించారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో ‘‘రుణ మేళా’’లను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రుణ వృద్ధి రేటు దాదాపు 6 శాతంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనబడుతోంది.  

2019 నుంచీ  రూ.4.94 లక్షల కోట్ల రుణాలు
బ్యాంకింగ్‌ చేపట్టిన ప్రత్యేక చర్యల ద్వారా 2019 నుంచి మార్చి 2021 వరకూ రూ.4.94 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈ ఏడాది అక్టోబర్‌ నుంచీ రుణ వృద్ధి పెరుగుదలకు బ్యాంకింగ్‌ జిల్లాలవారీ మేళాలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు–సూక్ష్మ రుణ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐ)ల ద్వారా రుణ గ్రహీతలకు రూ.1.5 లక్షల కోట్ల వరకూ రుణాన్ని అందించాలన్నది కేంద్రం లక్ష్యమని తెలిపారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రుణ వృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆలాగే ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా, ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత అందుబాటులో ఉంచడానికి రాష్ట్రాలవారీ ప్రత్యేక చర్యలు అవసరమని పేర్కొన్నారు.  

బ్యాంకర్లతో కీలక చర్యలు
అంతకుముందు ఆర్థికమంత్రి 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎండీ, సీఈఓలతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ‘‘ఒక జిల్లా, ఒక ఎగుమతుల కేంద్రం’’ సందేశంలో భాగంగా ఎగుమతిదారులకు తగిన రుణ లభ్యత కల్పించడానికి జిల్లాలవారీగా ప్రత్యేక దృష్టి సారించాలని బ్యాంకులను కోరినట్లు సీతారామన్‌ తెలిపారు. అలాగే ఫైనాన్షియల్‌ టెక్నాలజీ డిమాండ్లను నెరవేర్చడంలో తగిన మద్దతు నివ్వాలని సూచించారు.  ఈ సమావేశంలో భాగంగా ఆర్థికమంత్రి 2021–22కి సంబంధించి ‘ఈఏఎస్‌ఈ 4.0 ఇండెక్స్‌’ లక్ష్యాలను ఆవిష్కరించా రు. స్మార్ట్‌ అండ్‌ క్లీన్‌ బ్యాంకింగ్‌ దిశలో అడుగులు, లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉమ్మడి సంస్కరణల ఎజెండాగా 2018 జనవరిలో ‘ఈజ్‌’ విధానాన్ని ఆవిష్కరించడం తెలిసిందే.  

ఆర్థికమంత్రి ఇంకేమన్నారంటే...
► సరఫరాల చైన్‌ను మెరుగుపరచడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం దిగివస్తోంది. కరోనా కారణంగా సరఫరాల వ్యవస్థ దెబ్బతినడం వల్లే రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం దాటింది. ద్రవ్యోల్బణం కదలికలను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. అదుపునకు రాష్టాలతో కలిసి పనిచేస్తుంది.  
► గత యూపీఏ ప్రభుత్వ ఆయిల్‌ బాండ్ల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మోయాల్సి వస్తోంది.  
► పెట్రోలు ధరల అదుపునకు రాష్ట్రాలతో కేంద్రం సమన్వయం అవుతుంది.

మోనిటైజేషన్‌ అంటే... రాహుల్‌ అర్థం చేసుకున్నారా?
రెండు రోజుల క్రితం తాను ప్రకటించిన నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌పై రాహుల్‌ గాంధీ చేస్తున్న విమర్శలపై ఆర్థికమంత్రి తీవ్రంగా స్పందించారు. ‘‘అసలు ఆయన (రాహుల్‌ గాంధీ) మోనిటైజేషన్‌ అంటే ఏమిటో అర్థం చేసుకున్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. 70 ఏళ్లపాటు కూడబెట్టిన ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటుకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణను మాత్రమే అప్పగిస్తున్నామని, యజమాని ప్రభుత్వమేనని కేంద్రం స్పష్టం చేస్తోంది.

>
మరిన్ని వార్తలు