Fortune India Most Powerful Woman 2021: కరోనా టైంలో సాయం.. నీతా అంబానీకి అరుదైన గౌరవం,సెకండ్‌ ప్లేస్‌లో..

1 Dec, 2021 16:20 IST|Sakshi

Fortune India Most Powerful Woman 2021: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌, చైర్‌పర్సన్ నీతా అంబానీ వ్యాపార రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ టైమ్‌లో కరోనా బాధితులకు ఉచితంగా సేవల్ని అందించినందుకు గాను ఆమెకు అరుదైన గౌరవం లభించింది. ఫార్చున్ మ్యాగజైన్ రిలీజ్‌ చేసిన 'మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఉమెన్‌' జాబితాలో రెండో స్థానంలో చోటు దక్కించుకున్నారు.

దేశంలో కరోనా కారణంగా ఆస్పత్రులలో బెడ్ల కొరత ఏర‍్పడింది. అయితే ఆ బెడ్ల కొరత లేకుండా కోవిడ్‌ బాధితులకు నీతా అంబానీ అండగా నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి ముంబైలో తొలిసారి 250 పడకల కోవిడ్‌ వార్డ్‌ను ఏర్పాటు చేయించి ట్రీట్మెంట్‌ ప్రారంభించారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా 2,000 పడకలకు పెంచి ఉచితంగా ట్రీట్మెంట్‌ అందించేలా చేశారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  ప్రతి రోజూ 15,000 కంటే ఎక్కువగా కోవిడ్-19 టెస‍్టులు నిర్వహించేలా టెస్టింగ్‌ ల్యాబ్‌తో పాటు ప్రతిరోజూ లక్ష పీపీఈ కిట్లతో పాటు ఎన్‌-95 మాస్క్‌లను అందించారు. 

రిలయన్స్‌ ఫౌండేషన్ ఫౌండర్‌గా ఉన్న నీతా అంబానీ జియో హెల్త్‌ హబ్‌ సాయంతో ఇప్పటివరకు 25 లక్షల మందికి కోవిడ్‌ టీకాలు అందేలా చేశారు. 100 జిల్లాలు, 19 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు, రోజూవారీ కూలీలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో సహా  8.5 కోట్లకు పైగా ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించి మానవత్వం చాటుకున్నారు. అయితే మహమ్మారి విలయం తాండవం చేస్తున్న సమయంలో బాధితులకు అండగా నిలిచినందుకు గాను ఫార్చున్‌ మ్యాగజైన్‌ దేశంలోనే 'మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ ఉమెన్‌' జాబితాలో నీతా అంబానిని ఎంపిక చేసింది.

చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాలు ఇవే..! టాప్‌-10 లో ఇండియన్‌ ఫ్యామిలీ..!

మరిన్ని వార్తలు