Niti Aayog VC Urges Tesla: టెస్లా కార్లపై నీతి ఆయోగ్‌ కీలక వ్యాఖ్యలు...!

22 Oct, 2021 12:24 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లోకి వచ్చేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత్‌లో టెస్లా తన కార్లను ప్రవేశపెట్టడానికి సిద్దమైనా..ఇంపోర్ట్‌ టాక్స్‌ భారత్‌లో ఎక్కువగా ఉండటంతో కంపెనీ ఊగిసలాడిపోతుంది. ఇప్పటికే టెస్లా పలుమార్లు ఇంపోర్ట్‌ టాక్స్‌లను తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని  విన్నవించింది. దిగుమతి సుంకాల తగ్గింపుపై  గత నెలలో పీఎం కార్యాలయంలో టెస్లా ఎగ్జిక్యూటివ్స్‌  సంబంధింత అధికారులతో చర్చలు జరిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీతో టెస్లా అధినేత ఎలన్‌మస్క్‌ కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. 
చదవండి: భారత్‌లో అవకాశాలను సొంతం చేసుకోండి

ఇక్కడే తయారుచేయండి..: నీతి ఆయోగ్‌
భారత్‌లో టెస్లా కార్ల వ్యవహారంపై తాజాగా నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ స్పందించారు. టెస్లా తన ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లోనే తయారు చేయాలని కోరారు. అదే సమయంలో టెస్లాకు ప్రభుత్వం నుంచి కావలసిన పన్ను ప్రయోజనాలను కచ్చితంగా పొందే అవకాశం ఉందని రాజీవ్‌ కుమార్‌  హామీ ఇచ్చారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (PAFI) వర్చువల్ కాన్ఫరెన్స్‌లో గురవారం రోజున రాజీవ్‌ కుమార్‌ ఈ వ్యాఖ్యలను చేశారు.

అమెరికా నుంచి టెస్లా తన ఉత్పత్తులను భారత్‌కు రవాణా చేసే బదులుగా ఇక్కడే తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే...ఏకకాలంలో టెస్లాకు, ఇక్కడి వారికి కూడా ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా...ఈ నెల ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా భారత్‌లోనే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయమని టెస్లాను అనేకసార్లు కోరారు.
చదవండి: కేంద్రం టఫ్‌ కండిషన్స్‌.. ఏకంగా ప్రధానినే బతిమాలుతున్న ఎలన్‌ మస్క్‌!

మరిన్ని వార్తలు