‘జనాల్లో నమ్మకం కలిగిస్తా’.. గడ్కరీ కొత్త కారు చాలా ప్రత్యేకం మరి!

4 Dec, 2021 13:24 IST|Sakshi

ఇప్పుడున్న కేంద్ర మంత్రుల్లో నితిన్‌ గడ్కరీకి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్‌ కాస్త ఎక్కువే!. ఆయన నిర్ణయాలే కాదు.. ఆలోచనలు, ఆచరణలు సైతం అప్పుడప్పడు ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాగే సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యాయ్నాలను ఉపయోగించాలని పిలుపు ఇచ్చేవాళ్లలో నితిన్ గడ్కరీ కూడా ఒకరు.  తాజాగా ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం ఓ అడుగు ముందుకేశారు. 


కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మధ్య ఓ కారును కొనుగోలు చేశారట. ఇందులో ఇంధనంగా పెట్రోల్, డీజిల్, సహజవాయువులను ఉపయోగించరు. ఈ కారు గ్రీన్‌ హైడ్రోజన్‌తో నడుస్తుంది. ఫరిదాబాద్‌లోని ఓ ఆయిల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందించిన కారును త్వరలో రోడ్డెక్కించబోతున్నట్లు ఓ సదస్సులో పాల్గొన్న ఆయన స్వయంగా వెల్లడించారు. ‘నా హైడ్రోజన్ కారుతో త్వరలోనే ఢిల్లీ రోడ్లపై ప్రయాణిస్తా. ప్రజల్లో ఈ తరహా ప్రత్యామ్నాయ ఇంధనాలపై అవగాహన కల్పిస్తా. ఇది నమ్మదగిన విషయమేనని, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణ అవుతుందని జనాలకి నమ్మకం కలిగిస్తా’ అని ప్రసంగించారాయన.

యూట్యూబ్‌తో లక్షలు సంపాదిస్తున్న గడ్కరీ!

డ్రైనేజీ మురుగు నీరు, ఘనరూప వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ను తయారుచేసి దాన్నే ఇంధనంగా ఉపయోగించే వీలుందని, ఈ తరహా హైడ్రోజన్‌ ఇంధనంతో బస్సులు, ట్రక్కులు, కార్లను రోడ్లపై పరుగులు తీయించాలనేది తన ప్రణాళిక అని ఈ సందర్భంగా గడ్కరీ స్పష్టం చేశారు. ఇక మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు విశేష ప్రాధాన్యత లభిస్తోంది. కాలుష్య రహితానికి ఆస్కారం ఉన్న ఇంధనాలపై ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యర్థాలను కూడా సద్వినియోగ పరిచేందుకు ప్రయత్నిస్తున్నానని గడ్కరీ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ కార్ల నుంచి వేడి గాలి, నీటి ఆవిరి మాత్రమే వెలువడతాయి. 

దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ!

గడ్కరీ కొత్త స్వరం.. కార్లకు మాత్రమే వినసొంపైన హారన్లు!

చదవండి: ‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు