ఎంఎస్‌ఎంఈల్లో మరింతగా ఇన్వెస్ట్‌ చేయండి

13 Aug, 2020 05:51 IST|Sakshi

అంతర్జాతీయ సంస్థలకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ:  భారత రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎంఎస్‌ఎంఈ) మరిన్ని పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సంస్థలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. రహదారి భద్రత కోసం తీసుకున్న చర్యలను మంత్రి ప్రస్తావిస్తూ.. వీటి ఉద్దేశ్యం 2030 నాటికి రహదారి ప్రమాదాల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడడమేనని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్, ఎంఎస్‌ఎంఈ సంస్థలు రెండు ప్రధాన వృద్ధి కారకాలుగా పేర్కొన్నారు.

ఇండో ఆస్ట్రేలియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రహదారి భద్రత విషయంలో భారత్‌–ఆస్ట్రేలియా సహకారం అందించుకుంటున్నాయని చెప్పారు.  రహదారుల అభివృద్ధి, నవీకరణ కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను 50 శాతం వరకు తగ్గిస్తాయన్నారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు ఎన్నో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి రూ.7,000 కోట్ల నిధుల సాయానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు అంగీకరించినట్టు మంత్రి గడ్కరీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు