మేఘా ‘జోజిలా’ టన్నెల్‌ పనులు ప్రారంభం

16 Oct, 2020 06:09 IST|Sakshi

లాంఛనంగా ఆరంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ: శ్రీనగర్‌ లోయ, లేహ్‌ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన జోజిలా టన్నెల్‌ నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్‌ కన్నా ముందుగా నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్‌ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.

ఎంఈఐఎల్‌ రూ. 4,509.5 కోట్లకు బిడ్‌ వేసింది. సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్‌ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి. ఇది పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌గా నిలుస్తుంది. శ్రీనగర్‌–లేహ్‌ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది. శ్రీనగర్‌–కార్గిల్‌–లేహ్‌ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది. సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్‌–లేహ్‌ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే  ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది.

మరిన్ని వార్తలు