ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట.. ఆ ఛార్జీలపై జీఎస్‌టీ ఉండదు

22 Aug, 2021 15:09 IST|Sakshi

ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు నామమాత్రపు మొత్తాన్ని వసూలు చేసి క్యాంటీన్ సదుపాయాలను కల్పిస్తాయి. అయితే, యాజమాన్య సంస్థలు అందించే క్యాంటీన్ సదుపాయాలు ఉపయోగించే ఉద్యోగులు వారు చెల్లించే మొత్తంపై జీఎస్‌టీ వసూలు చేయవద్దు అని ఏఏఆర్ తీర్పు ఇచ్చింది. క్యాంటీన్ సదుపాయం వాడుకున్నందుకు ఉద్యోగుల నుంచి యాజమాన్యం వసూలు చేసే నామమాత్రపు మొత్తంపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్‌టీ) వర్తిస్తుందా అనే దానిపై తీర్పు కోరుతూ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) గుజరాత్ బెంచ్ ను టాటా మోటార్స్ ఆశ్రయించింది. 

ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులకు అందించే క్యాంటీన్ సదుపాయంపై సర్వీస్ ప్రొవైడర్ వసూలు చేసిన జీఎస్‌టీపై ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) కోర్ అవకాశం ఉందా అని కంపెనీ కోర్టును కోరింది. టాటా మోటార్స్ తన ఉద్యోగుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేసిందని, దీనిని తృతీయపక్ష క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ నడుపుతున్నట్లు కోర్టుకు తెలిపింది. క్యాంటీన్ ఛార్జీలలో ఎక్కువ మొత్తాన్ని టాటా మోటార్స్ భరిస్తుంది అని మిగిలిన భాగాన్ని ఉద్యోగులు భరిస్తున్నట్లు పేర్కొంది. క్యాంటీన్ ఛార్జీల్లో ఉద్యోగుల చెల్లించే మొత్తాన్ని కంపెనీ సేకరించి క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ కు చెల్లిస్తుంది. అలాగే, క్యాంటీన్ ఛార్జీల్లో ఉద్యోగుల భాగాన్ని సేకరించే ఈ కార్యకలాపాల్లో టాటా మోటార్స్ ఎలాంటి లాభం మార్జిన్ ను కలిగి లేదని పేర్కొంది.(చదవండి: టాటా మోటార్స్‌ నుంచి మైక్రో ఎస్‌యూవీ)

జీఎస్‌టీ వర్తించదు
ఈ క్యాంటీన్ సౌకర్యం కింద చెల్లించిన జీఎస్‌టీపై ఐటీసీ జీఎస్‌టీ చట్టం కింద క్రెడిట్ బ్లాక్ చేస్తున్నట్లు ఏఏఆర్ తన తీర్పులో తెలిపింది. "క్యాంటీన్ ఛార్జీల విషయంలో ఉద్యోగుల నుంచి సంస్థలు వసూలు చేస్తున్న మొత్తాన్ని సేకరించి క్యాంటీన్ సర్వీస్ ప్రొవైడర్ కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఉద్యోగులు చెల్లించే మొత్తంపై కాకుండా యాజమాన్యాలు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది" అని ఏఏఆర్ తెలిపింది. ప్రస్తుతం సబ్సిడీ కింద ఆహార సదుపాయాలను కల్పిస్తున్న కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల నుంచి వసూలు చేసిన క్యాంటీన్ ఛార్జీలపై 5 శాతం పన్ను వసూలు చేస్తున్నట్లు ఏఎంఆర్ జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ తెలిపారు. క్యాంటీన్ ఛార్జీల ఉద్యోగుల నుంచి వసూలు చేసే నామమాత్రపు మొత్తంపై ఎటువంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు అని అథారిటీ తీర్పు ఇచ్చినట్లు మోహన్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు