మందు, జూదం, రాజకీయాల యాడ్స్‌కి నో!

17 Jun, 2021 09:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్‌ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్‌ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్‌లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్‌ 14న యూట్యూబ్‌ మస్ట్‌హెడ్‌ (యూట్యూబ్‌ టాప్‌ పేజీ) కంటెంట్‌కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్‌ చేసింది.    

గ్యాంబ్లింగ్‌, ఆల్కాహాల్‌, పాలిటిక్స్‌, డ్రగ్స్‌కు లింకు ఉన్న యాడ్‌లేవీ ఇకపై యూట్యూబ్‌ టాప్‌, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్‌ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయగానే టాప్‌లో కనిపించే ఈ యాడ్స్‌ ద్వారా గూగుల్‌కు భారీ ఆదాయం వస్తుంటుంది. అయితే ఇకపై ఆ ప్లేస్‌లో మాగ్జిమమ్‌ యూజర్లకు పనికొచ్చేవి, అవగాహనకు సంబంధించిన యాడ్‌లే ఉండాలని యూట్యూబ్‌ నిర్ణయించింది. 

‘‘యూజర్ల పట్ల ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాల’’ని అనుకుంటున్నాం యూట్యూబ్‌ ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. వీటితో పాటు యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలను, అసత్య ప్రచారాలకు సైతం యూట్యూబ్‌లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అంతేకాదు యాడ్‌లకు సంబంధించిన వీడియోల(థంబ్‌నెయిల్స్‌) విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ‘‘అవి మానసికంగా యూజర్‌పై ప్రభావం చూపెడతాయి. కాబట్టి, అలాంటి యాడ్‌లను ప్రొత్సహించం’’ అని యూట్యూబ్‌ ప్రతినిథి ఒకరు వెల్లడించారు.

చదవండి: యూట్యూబ్‌ గురించి ఇవి తెలుసుకోవాల్సిందే

మరిన్ని వార్తలు